వరి ధాన్యానికి సర్కార్ మద్దతు ధర ప్రకటన.. ఏ-గ్రేడ్‌ వరికి రూ.1,888

తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వానాకాలం పంట వరిధాన్యం సేకరణ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది.

వరి ధాన్యానికి సర్కార్ మద్దతు ధర ప్రకటన..  ఏ-గ్రేడ్‌ వరికి రూ.1,888

Updated on: Oct 10, 2020 | 8:36 PM

తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వానాకాలం పంట వరిధాన్యం సేకరణ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఏ-గ్రేడ్‌ వరికి రూ.1,888, సాధారణ రకం ధాన్యానికి రూ. 1,868 కనీస మద్దతు ధరను ప్రకటించింది. పంటల కొనుగోళ్లు, యాసంగిలో సాగు విధానంపై సీఎం కేసీఆర్‌ శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతిభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమాలకర్‌, సబంధిత అధికారులు పాల్గొన్నారు. వరిధాన్యం సేకరణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5,690 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందులో భాంగా పౌరసరఫరాల సంస్థ ఐకేపీ, పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌, జీసీసీ, ఏఎంసీ కొనుగోలు కేంద్రాల ద్వారా వరిధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

హాకా ద్వారా 9 జిల్లాల్లో వరిధాన్యం కొనుగోళ్లు జరుపనున్నారు. వానాకాలంలో 90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. సీఎంఆర్‌ బియ్యాన్ని 15 రోజుల్లో మిల్లర్లు ప్రభుత్వానికి అందించాలని ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా బియ్యం ఇవ్వని అదేవిధంగా పీడీఎస్‌ బియ్యాన్ని పక్కదారి పట్టించే మిల్లర్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మిల్లర్లు ఇచ్చే బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రభుత్వం వినియోగించనుంది. ప్రతీ సీజన్‌కు సంబంధించిన గోనె సంచులు సేకరణను నెలవారీ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ, సంబంధిత అంశాల కోసం టోల్‌ఫ్రీ నంబరును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎలాంటి ఫిర్యాదులైనా 180042500333, 1967 కు కాల్ చేయాలని అధికారులు సూచించారు .