మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణ అసెంబ్లీ సంతాపం
భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెలంగాణ శాసనసభ సంతాపం తెలిపింది. ప్రణబ్ మృతిపట్ల తెలంగాణ అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు.
భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెలంగాణ శాసనసభ సంతాపం తెలిపింది. ప్రణబ్ మృతిపట్ల తెలంగాణ అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. తెలంగాణ శాసనసభ ప్రణబ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని సీఎం తెలిపారు. భారతదేశం శిఖర సమానమైన నాయకుడిని కోల్పోయింది. 1970 తర్వాత దేశ అభివృద్ధి చరిత్రలో ప్రణబ్ ముఖర్జీ పేరుకు ప్రత్యేక స్థానం ఉందని కేసీఆర్ కొనియాడారు. క్రమశిక్షణ, కఠోర శ్రమ అంకితభావంతో అంచలంచలుగా ఎదిగారని, భారతదేశ ఆర్థిక వ్యవస్థను అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన ఘటన ప్రణబ్ ముఖర్జీకే దక్కిందన్నారు. ప్రపంచంలోనే ప్రణబ్ ముఖర్జీ ప్రముఖ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్నారు. మహోన్నత రాజనీతిజ్ఞుడిగా మెలిగారు. రాజకీయాల్లో ఆయన పాత్ర చిరస్మరణీయమని సీఎం కేసీఆర్ అన్నారు.
రాజకీయ వేత్తగా, ట్రబుల్ షూటర్ గా పేరున్న ప్రణబ్.. మిత్ర పక్షాలను కలుపుకుని పోవడంలో విశ్వసనీయుడిగా ఆయన పేరొందారని సీఎం తెలిపారు. ప్రతిపక్షాలను సిద్ధాంతపరంగా మాత్రమే విమర్శించేవారని.. ఎంతటి జఠిల సమస్యను సామరస్యంగా పరిష్కరించే ఓర్పు ప్రణబ్ ముఖర్జీకి ఉందన్నారు కేసీఆర్. భారత 13వ రాష్ర్టపతిగా అత్యున్నత పదవి అలంకరించిన, జాతి నిర్మాణంలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2019లో భారతరత్న అవార్డును బహుకరించారు. రాష్ర్టఅవతరణకు సహాయ పడిన వారిగా కాకుండా, రాష్ర్ట విభజన బిల్లుపై ముద్ర వేసి తెలంగాణ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయారన్న కేసీఆర్ అన్నారు. ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెలంగాణ శాసనసభ సంతాపం తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానిస్తుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.