
మన దేశంలో కరోనా అడుగు పెట్టక ముందు వరకూ ప్రతి ఏడాది భద్రాద్రిలో రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగేది. సీతారాముల వివాహ వేడుకను కనులారా వీక్షించడానికి తెలుగు రాష్ట్రాలనుంచి కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరయ్యేవారు. ఇక సీతారాములకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ.

కోవిడ్ నిబంధనల నడుమ భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణ వేడుక కమనీయంగా సాగింది. సరిగ్గా పన్నెండు గంటలకు జిలకర్ర, బెల్లం పెట్టారు. అనంతరం మాంగళ్యధారణ జరిగింది. ఈ కమనీయ వేడుకను అశేష జనవాహిని పలు తెలివిజన్ల ద్వారా వీక్షించారు. సీతారాముల కల్యాణాన్ని గాంచిన రామ భక్తులు ఆనంద పారవశ్యంలో మునిగితేలారు.

భద్రాచలంలో ఉదయం 10:30 గంటలకు రాములోరి కళ్యాణ మహోత్సవం ప్రారంభమయ్యింది. మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రాములోరి కల్యాణానికి తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను ముత్యాల తలంబ్రాలను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు సమర్పించారు.

కరోనా నివారణ చర్యల నేపథ్యంలో ఈ ఏడాది కూడా సీతారాముల కల్యాణాన్ని కొద్దిమంది పురోహితులు, అతికొద్ది అతిధుల సమక్షములో నిర్వహించారు. కల్యాణ ఘట్టంలో కొందరు అర్చకులు రామయ్య తరఫున.. మరికొందరు అర్చకులు సీతమ్మ తరఫున ప్రతినిధులుగా వ్యవహరించి ఎదుర్కోలు ఉత్సవాన్ని కనుల పండువగా జరిపారు.

కరోనా మహమ్మారి వల్ల భక్తజనుల సందడి లేకుండానే కల్యాణ వేడుకలను నిర్వహించారు. ఇవాళ కల్యాణం ముగియడంతో రేపు శ్రీరామచంద్రుడి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం జరగనుంది. మరోవైపు కరోనా కారణంగా ఆలయంలో పూజలు, తీర్థ ప్రసాదాలు నిలిపివేశారు.