ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఎంతలా అంటే.. సోమవారం రోజు పార్టీ ప్రధాన కార్యాలయం వెలవెలబోయింది. ఎవరో కొద్దిమంది కార్యకర్తలు మాట్లాడుకుంటూ కనిపించారంతే. వారిని పలకరించగా ఎగ్జిట్ పోల్స్ తప్పని కొట్టి పారేశారు. ఓ కార్యకర్తను సంప్రదించగా.. కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు వస్తాయని, రాకపోతే ఈవీఎంలలో మోసాలు జరిగినట్టేనని అన్నారు. ఇక, ఎగ్జిట్ పోల్స్ బీజేపీ ఎత్తుగడ అని, వాటిని ఆ పార్టీ తప్ప ఎవ్వరూ నమ్మడం లేదని, ఆ ఫలితాలు మహాకూటమి భాగస్వామ్య పార్టీల్లో అనిశ్చితి సృష్టించే ప్రయత్నమేనని కొట్టి పారేస్తున్నారు.
అయితే ఎన్డీయేదే మళ్లీ అధికారమంటూ వచ్చిన ఎగ్జిట్ పోల్స్ను నిజమేనని నమ్మి నిరాశ, నిస్పృహలకు లోనుకావొద్దని కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సూచించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే మీడియా ద్వారా ఇటువంటి నివేదికలను బీజేపీ విడుదల చేయించిందని మండిపడ్డారు. కీలక సమయంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలపై ఓ కన్నేసి ఉంచాలని కార్యకర్తలకు సూచించారు.