
కోర్టు ధిక్కరణ కేసులో క్షమాపణ చెప్పేది లేదని ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు. ఒకవేళ క్షమాపణ చెబితే తన మనస్సాక్షిని ధిక్కరించినట్లు అవుతుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి సోమవారం సుప్రీం కోర్టుకు సప్లిమెంటరీ అఫిడవిట్ను సమర్పించారు. సుప్రీం న్యాయమూర్తులు, కోర్టులపై ఆయన చేసిన ట్వీట్లను కోర్టు ధిక్కరణగా పరిగణిస్తూ సుప్రీం కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇందుకు సంబంధించి క్షమాపణ చెప్పాలని, అతని ప్రకటనపై పునరాలోచన చేయాలని మూడు రోజుల గడువు ఇచ్చింది సుప్రీం కోర్టు. ఈ నేపథ్యంలో తన ట్వీట్లను బోనఫైడ్ చేస్తూ సుప్రీంకోర్టుకు ప్రశాంత్ భూషణ్ అఫిడవిట్ సమర్పించారు.
సుప్రీం కోర్టును గానీ, సదరు ప్రధాన న్యాయమూర్తికి గానీ అపకీర్తి తేవడం తన ఉద్దేశం కాదని ప్రశాంత్భూషణ్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. తాను చేసిన ట్వీట్లు తన నమ్మకానికి ప్రతీకలని, ఒకవేళ తాను బేషరతుగా క్షమాపణ చెప్పినా అందులో నిజాయతీ ఉండదని తేల్చి చెప్పారు. ఒకవేళ తాను క్షమాపణ కోరినట్లయితే కోర్టు ధిక్కరణతో పాటు తన మనస్సాక్షిని కూడా ధిక్కరించినట్లు అవుతుందని స్పష్టం చేశారు. మరోవైపు ధిక్కరణ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది.