Pawan Kalyan: పాకిస్థాన్‌లో హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తుంటారని చదివాం… ఇప్పుడు మన రాష్ట్రంలోనూ ఆలయాలపై దాడులు…

‘‘పాకిస్థాన్‌లో హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తుంటారని చదువుతుంటాం. ఇప్పుడు మన రాష్ట్రంలోనూ హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం, ఆలయ రథాల దగ్ధం చూస్తున్నామని’’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

Pawan Kalyan: పాకిస్థాన్‌లో హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తుంటారని చదివాం... ఇప్పుడు మన రాష్ట్రంలోనూ ఆలయాలపై దాడులు...

Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 02, 2021 | 7:26 AM

‘‘పాకిస్థాన్‌లో హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తుంటారని చదువుతుంటాం. ఇప్పుడు మన రాష్ట్రంలోనూ హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం, ఆలయ రథాల దగ్ధం చూస్తున్నామని’’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. దేవుడి విగ్రహం ధ్వంసంతో ఏపీలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారని, ఇలాంటి పరిస్థితి దురదృష్టకరమని పవన్‌ తెలిపారు. హిందూ ధర్మాన్ని విశ్వసించేవారి మనోభావాలను దెబ్బతీసేలా రాజమహేంద్రవరంలో జరిగిన ఘటన ఆవేదనకు గురి చేసిందని పేర్కొన్నారు. కాగా, శ్రీరాంనగర్‌ ప్రాంతంలో విఘ్నేశ్వర ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం చేతులను గుర్తు తెలియని వ్యక్తులు విరగ్గొట్టడం కలకలం రేపింది. ఈ ఘటనను ఖండిస్తూ పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

 

సీఎం జగన్ ఉదాసీనంగా ఉన్నారు…

రాష్ట్రంలో హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం, ఆలయ రథాల దగ్ధం చూస్తున్నామని పేర్కొన్నారు. ఆలయాలపై జరుగుతున్న ఘటనలు చూస్తుంటే పథకం ప్రకారమే దుశ్చర్యలకు తెగబడుతున్నారని అనుమానం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలో శ్రీ కోదండరాముడి విగ్రహ ధ్వంసంపై సీఎం జగన్‌ స్పందన ఉదాసీనంగా వ్యవహరించారని ఆక్షేపించారు. దేవుడితో చెలగాటమాడితే దేవుడే శిక్షిస్తాడు అంటూ ముఖ్యమంత్రి అనడాన్ని జనసేనాని తప్పుబట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు నేరాలను నిలువరించవన్నారు.

 

బాధ్యులను ఇప్పటివరకు గుర్తించి ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. దేవుడిపై భారం వేసి ఆలయాలను కాపాడే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని పవన్‌ ఆరోపించారు. రాష్ట్రంలో ఇలాంటి వరుస ఘటనలు చూస్తుంటే అసలు దేవాదాయ శాఖ అనేది ఒకటి ఉందా అనిపిస్తోందన్నారు. హిందూ దేవాలయాలపై సాగుతున్న దాడులను ఏ మత విశ్వాసాన్ని ఆచరించేవారైనా నిరసించాలన్నారు. అన్ని మతాల పెద్దలు ఒక వేదికపైకి వచ్చి విగ్రహ ధ్వంసాలు, రథాల దగ్ధాలను ఖండించాలని కోరారు. అప్పుడు మత సామరస్యం, లౌకిక వాదం పరిఢవిల్లుతాయని పవన్‌ తెలిపారు.

 

Also Read: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రేపు భేటీకానున్న తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, తాజా రాజకీయ వ్యూహాలపై చర్చ