కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. అయితే.. తాజాగా గోవా తరువాత మరొక రాష్ట్రం కూడా ఈ వైరస్ వ్యాప్తి నుంచి పూర్తిగా విముక్తి పొందింది. మిజోరాంలో కరోనా సోకిన ఏకైక వ్యక్తి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంకు చెందిన 50 ఏళ్ల మతాధికారి నెదర్లాండ్స్కు వెళ్లారు. మార్చి 24 న అతను కరోనా బారిన పడ్డాడు.
కాగా.. మిజోరాం రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఆర్ లాల్తాంగ్లియానా మాట్లాడుతూ.. గత 24 గంటల్లో కరోనా బారిన పడిన వ్యక్తికి సంబంధించిన రిపోర్టులో నాలుగుసార్లు నెగిటివ్ వచ్చిందని అన్నారు. దీంతో అతను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారన్నారు. ఇప్పుడు మిజోరంను కోవిడ్ -19 స్వేచ్ఛాయుత రాష్ట్రంగా ప్రకటించవచ్చు. ఇక్కడ ఒక్క కరోనా రోగి కూడా లేరని తెలిపారు. అంతకుముందు గోవా కూడా కరోనా వైరస్ పై విజయం సాధించింది. ఇక్కడ మొత్తం 7 కేసులు నమోదు కాగా, వాటిలో చివరి కేసు కూడా నెగిటివ్గా తేలింది.