ప్రత్యేక టెస్టింగ్‌ల్యాబ్‌ ఏర్పాటు చేయండి.. కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు మంత్రి కేటీఆర్ లేఖ

|

Jan 21, 2021 | 6:42 AM

హైదరాబాద్ నగరంలోని జినోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్, సర్టిఫికేషన్ ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర కుటుంబ...

ప్రత్యేక టెస్టింగ్‌ల్యాబ్‌ ఏర్పాటు చేయండి.. కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు మంత్రి కేటీఆర్ లేఖ
Follow us on

Minister KTR urged to Centre : హైదరాబాద్ నగరంలోని జినోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్, సర్టిఫికేషన్ ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర కుటుంబ సంక్షేమ వ్యవహారాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో బయోటెక్ కంపెనీలు ఏటా ఆరు బిలియన్ల డోసుల వ్యాక్సిన్లను తయారు చేస్తున్నాయని మంత్రి తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా తయారవుతున్న వ్యాక్సిన్‌ డోసుల్లో మూడోవంతు హైదరాబాద్ జినోమ్ వ్యాలీలోనే తయారవుతున్నాయని అన్నారు. ప్రధాని మోదీ సహా 80 దేశాలకు చెందిన రాయబారులు హైదరాబాద్‌లో పర్యటించి వ్యాక్సిన్ తయారీ సంస్థల ప్రతినిధులతో చర్చించి, తయారీపై వివరాలు అడిగి తెలుసుకున్నారని లేఖలో గుర్తుచేశారు.

ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ల తయారీకి సంబంధించి హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలిలో సెంట్రల్ డ్రగ్ లేబొరేటరీ ఉందని.. ప్రతిసారీ అక్కడకు వ్యాక్సిన్లను పంపించి సర్టిఫికేషన్ పొందేందుకు హైదరాబాద్ కంపెనీలకు చాలా సమయం పడుతోందని కేటీఆర్‌ హర్షవర్ధన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ తయారీకి సంబంధించి మరింత వేగంగా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నందున వెంటనే ఇక్కడ ప్రత్యేకంగా టెస్టింగ్ ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం కోల్‌కతా, ముంబయి, చెన్నై, కర్నాల్‌లో మాత్రమే ఉన్న ప్రభుత్వ మెడికల్ స్టోర్ డిపోను హైదరాబాద్‌లోనూ ఏర్పాటు చేయాలని కోరారు. తయారీ సంస్థలు వ్యాక్సిన్లను భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో డేటా మానిటరింగ్, ట్రాకింగ్ వ్యవస్థ వంటి సౌకర్యాలతో డిపో ఏర్పాటు చేస్తే ఆయా కంపెనీల భవిష్యత్తు ప్రణాళికలు, భారత వ్యాక్సిన్ తయారీ రంగానికి ఎంతో మేలు జరుగుతుందని కేటీఆర్‌ లేఖలో వివరించారు.