తెలుగులో భారీ సినిమాలకు పెట్టింది పేరు అల్లు అరవింద్. పేరుకు తగ్గట్టుగా సినిమాలను నిర్మిస్తుంటారు. ఆయన సినిమా చేస్తున్నారంటే చాలు భారీ బడ్జెట్ ఉంటుందని ముందే ఊహించుకోవచ్చు. కథ నచ్చితే చాలు.. బడ్జెట్ విషయంలో బౌండరీస్ని లెక్కచేయరు అల్లు అరవింద్. ఒకప్పుడు తెలుగు సినిమా మార్కెట్ కనీసం 40 కోట్లు కూడా లేని సమయంలో రామ్ చరణ్ హీరోగా 40 కోట్లతో మగధీర సినిమా నిర్మించాడు అల్లు అరవింద్. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే తెలుగులో భారీ సినిమాలు వచ్చాయి.
మరోసారి రామాయణం లాంటి ఇతిహాస గాథను 3డీలో చూపించేందుకు ఆయన సిద్దమయ్యారు. మహాభారతం, రామయణం వంటి ఇతిహాసాల గురించి ఎన్నిసార్లు చూసినా.. చదివినా తనివి తీరదు. రామాయణం అంటే రాముని గాథ ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయమే. అందుకే ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఎన్నిసార్లు రామాయణ గాథ చూపించినా కూడా ప్రేక్షకులు ఆదరించారు.
అయితే మొత్తం 3 భాగాలుగా రామాయణాన్ని సినిమా రూపంలో చూపించనున్నారు నిర్మాతలు అల్లు అరవింద్, మధు వంతెన, నమిత్ మల్హోత్రా. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందనుంది. ఇందులో నటించబోయే నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు మాత్రం వెల్లడికాలేదు.