కర్ణాటకలో మండ్య రాజకీయం రసవత్తరంగా మారుతోంది. దివంగత కన్నడ స్టార్ అంబరీష్ సతీమణి, నటి సుమలత ఇక్కడి నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తుండటంతో.. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు జేడీఎస్ కష్టపడాల్సి వస్తోంది. గతంలో ఈ స్థానం జేడీఎస్ కంచుకోట అయినా కూడా సుమలతపై సానుభూతి పెల్లుబికే అవకాశం కనిపిస్తుంది. జేడీఎస్ తరుపున కుమారస్వామి కుమారుడు నిఖిల్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఇటీవలే నిఖిల్ తరుపున అక్కడ ప్రచారం నిర్వహించారు. చంద్రబాబుతో ప్రచారం ద్వారా అక్కడి తెలుగువారిని జేడీఎస్ వైపు ఆకర్షించవచ్చునని కుమారస్వామి భావించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత, సినీ నటుడు మోహన్ బాబు మండ్య రాజకీయంపై ట్విట్టర్ ద్వారా స్పందించారు.
ఒకప్పుడు అంబరీష్ను చంద్రబాబు తన ద్వారా ఎన్నో కార్యక్రమాలకు పిలిపించారని.. అలాంటి చంద్రబాబు ఇప్పుడు ఆయన భార్యకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు కనీస కృతజ్ఞతాభావం లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు ఆమెకు మద్ధతు తెలుపకపోగా… వ్యతిరేకంగా ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. ఈ ఎన్నికల్లో డబ్బు, కుల రాజకీయాలను పక్కనపెట్టి మండ్య ప్రజలు సుమలతను గెలిపించాలని పిలుపునిచ్చారు. మరోవైపు పలువురు సినీ నటులు నుంచి సుమలతకు మద్దతు లభిస్తోంది. ఇప్పటికే కన్నడ స్టార్ హీరో యశ్ సుమలతకు బాసటగా నిలిచిన విషయం తెలిసిందే.
To all the people of Kannada, especially Mandya people and fans… pic.twitter.com/E3jiTbjKax
— Mohan Babu M (@themohanbabu) April 17, 2019