రాముడు పుట్టింది మన అయోధ్యలోనే .. ! సీతమ్మ పుట్టింది మాత్రం నేపాల్లోనే!
శ్రీరామచంద్రుడు పుట్టింది మా దగ్గరేనంటున్నాడు నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి.. నిజమైన అయోధ్య నేపాల్లో బిర్గుంజ్కు పశ్చిమాన ఉన్న థోడీలో ఉందంటున్నారు.. ఏ చారిత్రిక ఆధారాలతో ఆయన ఈ మాట అంటున్నాడో తెలియదు కానీ ఆ పలుకుల్లో గిచ్చి కయ్యం పెట్టుకోవాలన్న దుర్బుద్ధి మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.. దీని వెనకాల చైనా కుతంత్రమూ ఉందని అనిపిస్తోంది..
జగదానందకారకుడైన శ్రీరామచంద్రుడు పుట్టింది మా దగ్గరేనంటున్నాడు నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి.. నిజమైన అయోధ్య నేపాల్లో బిర్గుంజ్కు పశ్చిమాన ఉన్న థోడీలో ఉందంటున్నారు.. ఏ చారిత్రిక ఆధారాలతో ఆయన ఈ మాట అంటున్నాడో తెలియదు కానీ ఆ పలుకుల్లో గిచ్చి కయ్యం పెట్టుకోవాలన్న దుర్బుద్ధి మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.. దీని వెనకాల చైనా కుతంత్రమూ ఉందని అనిపిస్తోంది.. చైనా ఆదేశాల మేరకు ఉద్దేశపూర్వకంగానే భారత్ను ఓలి కెలుకుతున్నాడు.. ఓలి సీతమ్మ పుట్టిన గడ్డ అనబోయి పొరపాటున రామయ్య జన్మించిన ప్రదేశమన్నాడేమో! ఎందుకంటే సీతాదేవి పుట్టింది మాత్రం ఇప్పుడున్న నేపాల్లోనే!
నిజానికి రామాయణం అనగానే మనకు స్ఫురణకు వచ్చే నగరాలు ఒకటి అయోధ్య, రెండు మిథిల! మొదటిది ఇనకులతిలకుడు రామచంద్రుడు పుట్టిన చోటు. రెండోది జనకుడు-రత్నమాలలకు అయోనిజ సీతామాత దొరికిన చోటు! మైథిలి పుట్టినిల్లు! ఆ మిథిలానగరంలోనే సీతారాముల కళ్యాణం జరిగింది. అప్పట్లో మిథిలా రాజ్యం బీహార్ నుంచి నేపాల్ వరకు విస్తరించి ఉండేది..ఈ రాజ్యాన్నే విదేహ రాజ్యం కూడా అనేవారు. సీతాదేవికి వైదేహి అన్న పేరు ఈ కారణంగానే వచ్చింది.. ఆ జనకుడి రాజధానే నేపాల్లో ఉన్న జనక్పురి!
అప్పట్లో నేపాళ్లు.. గీపాళ్లు లేవన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి.. సరే.. మనకు ఎంతసేపూ అయోధ్యనే గుర్తుకొస్తుంది తప్ప జనక్పురిని తల్చుకోము.. ఓలి మతిలేని వ్యాఖ్యల కారణంగా ఇప్పుడు తల్చుకోవల్సి వస్తోంది.. ఇప్పుడే కాదు.. చాలా కాలం పాటు సీతాదేవి పుట్టిన చోటును అక్కడి జనం కూడా పట్టించుకోలేదు.. 1657లో సుర్కి శూర్దాస్ అనే సన్యాసికి ఇక్కడ సీతాదేవి విగ్రహాలు దొరికాయి. అప్పట్నుంచి తమ ప్రాంతానికి ఉన్న విశిష్టతను గమనించసాగారు.. 1910లో నేపాల్ రాణి అయిన వృషభాను ఇక్కడ జానకీ మందిరాన్ని నిర్మించారు. వేల గజాల విస్తీర్ణంలో .. 150 అడుగుల ఎత్తున్న ప్రాకారంతో ఈ ఆలయాన్ని నిర్మించారు.. పాలరాతి గోడలు.. అద్దాల మేడలు ప్రత్యేకం.. అప్పట్లోనే ఆలయ నిర్మాణానికి తొమ్మిది లక్షల రూపాయల వ్యయం అయ్యిందట! అందుకే ఈ మందిరాన్ని నౌ లాఖ్ మందిర్ అని పిలుచుకుంటారు.
జానకీమందిరం నిర్మించిన చోటునే సీతాదేవి శివధనస్సును పూజించిందట! సీతారాముల వివాహమహోత్సం జరిగింది కూడా ఇక్కడేనట! అందుకే ఆలయ నైరుతి భాగాన పెద్ద వివాహ మండపాన్ని నిర్మించారు. మనం సీతారామకల్యాణాన్ని చైత్ర శుద్ధ నవమి రోజున జరుపుకుంటాం కదా! కానీ ఇక్కడ మాత్రం ప్రతి ఏడాది మార్గశిర మాసం శుక్ల పంచమి రోజున సీతారాముల కల్యాణం జరుగుతుంది. ఆ రోజునే ఆదిదేవుడైన రాముడికి… ఆదిలక్ష్మి అయిన సీతమ్మకు పెళ్లయిందన్నది ఇక్కడి ప్రజల నమ్మకం. ఆలయంలో సీతారాములు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల విగ్రహాలు చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంటాయి.. రోజూ కొన్ని వేలమంది భక్తులు ఆలయ సందర్శనకు వస్తుంటారు. శ్రీరామనవమి, విజయదశమి, సంక్రాంతి, వివాహ పంచమి పండుగలప్పుడు అయితే భక్తులు కిటకిటలాడుతుంటారు.
అంచేత సీతమ్మతో ఓలి సరిపెట్టుకుంటే ఆయనకే మంచిది.. ఇప్పటికే రెండు మూడు గ్రామాలను తమ దేశంలో కలిపేసుకుని, కొత్త మ్యాచ్ ఇదేనంటూ కొత్త నాటకానికి తెరతీసినా పోన్లే పాపం అని భారత్ ఊరుకుంటుంటే ఇప్పుడు ఏకంగా రఘుకులసోముడైన రాముడినే హైజాక్ చేయాలనుకుంటున్నాడు.. వాల్మీకి మహర్షి కూడా రామాయణంలో రాముడు జన్మించింది అయోధ్యలోనే అని అన్నాడు తప్ప తన ఆశ్రమంలో అని చెప్పలేదు. వాల్మీకి ఆశ్రమంలోనే రాముడు పుట్టాడు అన్న వ్యాఖ్యల్లో ఓలి దురుద్దేశం కనిపిస్తోంది. అయినా వాల్మీకి ఆశ్రమం నేపాల్లో లేదు.. ఉత్తరప్రదేశ్లోని బిత్తూరులో ఉంది.. ఓవరాల్గా చూస్తే ఓలి కావాలనే, భారత్ను గిల్లాలనే ఓ పిచ్చి వాగుడు వాగాడనిపిస్తోంది.. రాముడు నేపాల్లో పుట్టాడన్నదానికి ఎలాంటి శాస్తీయత లేదు.. ఎలాంటి చారిత్రక ఆధారాలూ లేవు..