జార్ఖండ్లోని లోహర్దగా జిల్లాలో హృదయవిదాకర ఘటన ఒకటి వెలుగుచూసింది. బతికి ఉండగానే శిశువును పాతిపెట్టిన విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. కుడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామంలో రోడ్డుమీద వెళుతున్న ఒక వ్యక్తికి సమీప పొదల్లోంచి శిశువు ఏడుపు వినిపించింది. దీంతో పరిసరాల్లో వెతుక్కుంటూ అక్కడకు వెళ్లి చూడగా, భూమిలోపలి నుంచి చిన్న పిల్లల రోదన వినిపిస్తుందని గ్రహించాడు. వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. దీంతో స్థానికులంతా అక్కడికి చేరుకుని, భూమిలో పాతిపెట్టిన ఆ శిశువును వెలికితీశారు. ఆ శిశువు ప్రాణాలతో క్షేమంగానే ఉండటంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రాణాలతో బయటపడిని ఈ చిన్నారికి గ్రామానికి చెందిన పలువురు తల్లులు ఆహారం అందించారు. అలాగే, ఆ శిశువును దత్తత తీసుకునేందుకు పోటీపడ్డారు. జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు గ్రామస్తులు. దీంతో పోలీసులు గ్రామానికి చేరుకుని, ఆ శిశువును ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఆ శిశువు తల్లిదండ్రులు ఎవరనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.