India to surpass Japan : 2050 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న భారత్ 2050 నాటికి జపాన్, జర్మనీని వెనక్కినెట్టి మూడో స్థానానికి చేరుకోనున్నట్లు లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం పేర్కొంది.
ప్రస్తుతం పలు దేశాల్లో పని చేస్తున్న జనాభా, వారి వయసు, దేశ స్థూల జాతీయోత్పత్తి (GDP) ఆధారంగా ఈ పరిశోధన జరిగింది. 2017లో భారత్ ఈ జాబితాలో 7వ స్థానంలో ఉండేది. ఇప్పుడు 5వ స్థానంలో కొనసాగుతోంది.
ఈ గణాంకాల ఆధారంగానే పరిశోధకులు తాజా అధ్యయనం చేశారు. 2030 నాటికి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి, 2050 నాటికి ఇండియా 3వ స్థానానికి చేరుకుంటుందని అధ్యయనం పేర్కొంది. ప్రస్తుతం మొదటి రెండు స్థానాల్లో ఉన్న అమెరికా, చైనా 2050 నాటికి వాటి స్థానాలను నిలబెట్టుకుంటాయని పేర్కొంది.