రుతుపవనాల రాక ఆలస్యమవడంతో బీహార్లో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 184 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది వడదెబ్బతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. గయ, పాట్నాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం అప్రమత్తమైంది. గయలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. బీహార్లో వడదెబ్బ మరణాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మరోవైపు దీనిపై అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు సీఎం నితీష్ కుమార్.
బీహార్లోనే కాదు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. గత నెల రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 46 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. గత 30 రోజుల్లో దేశంలోని 10 ప్రాంతాల్లో భూమ్మీద అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ ప్రకటించింది.