దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో లాక్డౌన్ నేపథ్యంలో విధించిన నైట్ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా గుజరాత్లో ఆరోగ్య శాఖ మంత్రి కుమారుడిని, అతని ఇద్దరు స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సూరత్లో నైట్ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన మంత్రి కుమారుడు ప్రకాష్ను, అతని స్నేహితులను మహిళ కానిస్టేబుల్ సునీతా యాదవ్ నిలదీసింది.
దీంతో.. ఆ మహిళా కానిస్టేబుల్కు ఫోన్ చేసిన మంత్రి కుమారుడు వాగ్వాదానికి దిగాడు. ‘మాకు పవర్ ఉంది.. నేను తలుచుకుంటే మమ్మల్ని ఎక్కడ నిలబెట్టావో అదే ప్లేస్లో నిన్ను 365 రోజులూ నిల్చోబెడతా’ అని మంత్రి కొడుకు ఫోన్లో మహిళా కానిస్టేబుల్కు వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్కు సునీతా యాదవ్ బెదరలేదు. అంతే స్ట్రాంగ్గా బదులిచ్చింది. 365 రోజులు అక్కడ నిలబెడితే నిల్చోడానికి నేను నీకు బానిసను కాదు, నీ తండ్రికి సర్వెంట్ను కాదు అని గట్టిగా చెప్పింది.
ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. మంత్రి కొడుకు తీరుపై తీవ్ర విమర్శలు, కానిస్టేబుల్ సునీతా యాదవ్ ధైర్యానికి ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన పోలీసు ఉన్నతాధికారులు మంత్రి కొడుకును అదుపులోకి తీసుకున్నారు.