Greater Rayalaseema: మళ్ళీ తెరమీదికి గ్రేటర్ రాయలసీమ.. గంగుల ఉద్యమం

|

Feb 26, 2020 | 1:43 PM

దేశంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్లు తరచూ వినిపిస్తూనే వుంటాయి. ఈ డిమాండ్లు నెరవేరతాయా లేదా అన్నది పక్కన పెడితే రాజకీయ నాయకులకు మాత్రం ఓ వేదిక దొరుకుతుంది. చిన్ని రాష్ట్రాలు అభివృద్ధికి బాటలు వేస్తాయా? లేక నీరుగారుస్తాయా అన్న సందేహాన్ని పక్కన పెడితే.. ప్రస్తుతం ఆరు జిల్లాలతో గ్రేటర్ రాయలసీమ రాష్ట్రం కోసం మరోసారి డిమాండ్ తెరమీదికి వస్తోంది.

Greater Rayalaseema: మళ్ళీ తెరమీదికి గ్రేటర్ రాయలసీమ.. గంగుల ఉద్యమం
Follow us on

Greater Rayalaseema separate state demand came into light again: నాలుగు రాయలసీమ జిల్లాలకు రెండు దక్షిణ కోస్తా జిల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలన్న డిమాండ్ మరోసారి తెరమీదికి వచ్చింది. చిరకాలంగా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని భావిస్తున్న కొందరు రాజకీయ నాయకులు, యువజన, విద్యార్థి సంఘాలు గ్రేటర్ రాయలసీమ కోసం ఉద్యమాన్ని నిర్మించేందుకు సిద్దమవుతున్నారు.

ఇదీ చదవండి: జగన్ ప్రభుత్వానికి అమరావతి హైకోర్టు షాక్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించక ముందు భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రరాష్ట్రం. కర్నూలుగా రాజధానిగా 1953 అక్టోబర్ 1 నుంచి 1956 అక్టోబర్ 31 దాకా ఆంధ్రరాష్ట్రం కొనసాగింది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అవతరించడంతో రాజధాని హైదరాబాద్‌కు మారింది. ఆ తర్వాత సుమారు 58 సంవత్సరాలకు ఉమ్మడి ఏపీ విడిపోయింది. తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా మిగిలిపోవడంతో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మధ్య ప్రాంతంగా భావించి అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు. అయితే.. ఈ నిర్ణయం కొందరు రాయలసీమ వాసుల్లో అసంతృప్తిని రాజేసింది.

ఇదీ చదవండి: తెలంగాణ బీజేపీ నేతల్లో కొత్త మీమాంస

ఒకప్పటి రాజధాని కర్నూలుతోపాటు మొత్తం రాయలసీమ ప్రాంతానికి ఇప్పటికీ అన్యాయం జరుగుతుందని భావిస్తున్న కొందరు మరోసారి గ్రేటర్ రాయలసీమ నినాదాన్ని భుజానికెత్తుకుంటున్నారు. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ఒంగోలు జిల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం చేయాలన్నది వీరి ప్రధాన డిమాండ్. రాయలసీమ హక్కుల కోసం చిరకాలంగా పోరాడుతున్న మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి తాజాగా ఈ నినాదాన్ని మరోసారి సింహపురి కేంద్రంగా వినిపించారు.

ఇదీ చదవండి: చంద్రబాబుకు త్వరలో సతీష్‌రెడ్డి షాక్

నెల్లూరు, ఒంగోలుని కలిపి గ్రేటర్ రాయలసీమగా ఏర్పాటు చేయాలని, 1937 నుంచి రాయలసీమకు అన్యాయం జరుగుతూనే ఉందని ఆయనంటున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా రాయలసీమపై శీతకన్ను వేస్తున్నారని, పెన్నా పరివాహక ప్రాంతం అయిన ఈ జిల్లాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు ప్రతాప్ రెడ్డి. కర్నూలు రాజధానిగా కోల్పోయాం, కృష్ణ నది పక్కనే ఉన్నా నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నామని ఆయనంటున్నారు. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కోసం యువత, విద్యార్థులు, మేధావులు కలిసి రావాలని గంగుల పిలుపునిస్తున్నారు.

ఇదీ చదవండి: రెండు లారీల మధ్య ఇరుక్కున్న బతికిపోయిన లక్కీ ఫెల్లో

అయితే, రాజధానిని వికేంద్రీకరించి మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదిస్తున్న తరుణంలో గ్రేటర్ రాయలసీమ డిమాండ్‌కు ఏ మేరకు ప్రజల నుంచి ప్రతిస్పందన, మద్దతు లభిస్తాయన్నది వేచి చూడాల్సిందే.

ఇదీ చదవండి: రాజకీయ పార్టీలకు కిషన్‌రెడ్డి సవాల్