పోలీసు స్టేషన్లలో విద్యార్థినులకు కీలక బాధ్యతలు, ఒక్కరోజు మాత్రమే ! యూపీలో వినూత్న ప్రయోగం
యూపీలో విద్యార్థినులకు ప్రభుత్వం ఒక్కరోజు పోలీసు బాధ్యతలు అప్పగిస్తోంది. 'మిషన్ శక్తి' అనే పథకం కింద బహరైచ్ జిల్లాలో ఇలా ఐదుగురు విద్యార్థినులను పోలీసు స్టేషన్లలో 'ఇన్-చార్జులు' గా నియమించారు..
యూపీలో విద్యార్థినులకు ప్రభుత్వం ఒక్కరోజు పోలీసు బాధ్యతలు అప్పగిస్తోంది. ‘మిషన్ శక్తి’ అనే పథకం కింద బహరైచ్ జిల్లాలో ఇలా ఐదుగురు విద్యార్థినులను పోలీసు స్టేషన్లలో ‘ఇన్-చార్జులు’ గా నియమించారు. బాలికల్లో పోలీసులంటే భయం పోగొట్టేందుకు, పోలీసుల పనితీరు తెలుసుకునేందుకు ఈ వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టారు. వీరిలో 10 వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులు ఉన్నారు.వీరిలో ఒకరైతే పోలీసుల వెంట ఓ కుగ్రామానికి వెళ్లి ఇద్దరు సోదరుల మధ్య తలెత్తిన గొడవను పరిష్కరించడానికి ప్రయత్నించిందట.. ఈ బాలికలు తమ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి, తమ లక్ష్యాల సాధనకు ఈ పథకం ఎంతగానో తోడ్పడుతుందని కవితా మీనా అనే మహిళా పోలీసు అధికారి తెలిపారు. విద్యార్థినుల్లో ప్రతిభ గలవారు ఎంతోమంది ఉన్నారని, ఆమె చెప్పారు. తమ చదువు తరువాత వీరు పోలీసు ఉద్యోగాన్నే ఎంచుకునే అవకాశం ఉందన్నారు. మహిళలకు మరింత భద్రత అవసరమని, ఈ దిశగా ఈ ప్రయత్నం సఫలమవుతుందని ఆశిస్తున్నామని ఆమె అన్నారు. గత నెలలో ప్రారంభించిన మిషన్ శక్తి పథకాన్ని ఆరు నెలలపాటు కొనసాగించనున్నారు.
బాలికలు, మహిళలపట్ల నేరాలు పెరుగుతున్న యూపీ వంటి రాష్ట్రాల్లో ఈ విధమైన పథకాలు ప్రవేశపెట్టడం ముదావహమని నిపుణులు అంటున్నారు.