అత్యంత ప్రజాధారణ కల్గిన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్బుక్ పొలిటికల్ యాడ్స్ విషయంలో నిబంధనలను కఠినతరం చేసింది. 2016 కేంబ్రిడ్జి అనలిటికా వ్యవహారంలో తీవ్ర విమర్శలు ఎదుర్కోన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రకటనలు ఇచ్చేవారు ఇకపై పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా నిబంధనలు మార్చింది. ఫేస్బుక్లో ప్రకటనలు ఇచ్చే వారు ఎవరు? ఎక్కడి వారు? అనే వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. అంతేకాదు.. ట్యాక్స్ ఐడెంటీఫికేషన్ నంబర్ లేదా ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద రిజిస్టర్ అయినట్లుగా సాక్ష్యం చూపాలని ఎఫ్బీ పేర్కొంది.
తమను ఎవరు ప్రభావితం చేస్తున్నారనే విషయం ప్రజలకు దీని ద్వారా తెలుస్తుందని, ముసుగులో ఓటర్లను ప్రభావితం చేయడం కుదరదని ఫేస్బుక్ తన బ్లాగ్లో పేర్కొంది. ఒకవేళ తగిన ఆధారాలు సమర్పించకుంటే అక్టోబర్ మధ్య నాటికి సదరు యాడ్స్ను నిలిపివేస్తామని స్పష్టంచేసింది. ఈ నిబంధనలను అందుకోలేని చిన్న వ్యాపారులు, స్థానిక రాజకీయ నేతలు కేవలం నమోదిత ఫోన్ నంబర్తో పాటు వ్యక్తిగత సమాచారం మెయిల్ చేయడం ద్వారా యాడ్స్ ఇవ్వొచ్చని ఫేస్బుక్ పేర్కొంది. అయితే, ఇటువంటి యాడ్స్ ధ్రువీకరించిన సంస్థగా మాత్రం ట్యాగ్ చేయరు. అంతేకాదు ఓటింగ్లో పాల్గొనకుండా ప్రోత్సహించే యాడ్స్ను సైతం నిషేధిస్తామని ఫేస్బుక్ వెల్లడించింది.