దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దీని కట్టడికోసం మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో కర్ఫ్యూ విధించనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. జూలై 12న అర్థరాత్రి నుంచి జూలై 20 అర్థరాత్రి వరకు ఈ కర్ఫ్యూ కొనసాగుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కర్ఫ్యూ సమయంలో పాటించాల్సిన నియమనిబంధనలకు సంబంధించి జిల్లా అధికారులు మార్గదర్శకాలు విడుదల చేశారు.
వివరాల్లోకెళితే.. కర్ఫ్యూ సమయంలో మెడికల్ షాపులు, క్లినిక్లు, ప్రభుత్వ కార్యాలయాలు ఎప్పటిలాగే పనిచేస్తాయి. అయితే, రేషన్ దుకాణాలు, కూరగాయల దుకాణాలు, పాల దుకాణాలు, కిరాణా దుకాణాలను మాత్రం స్థానిక అధికారులు నిర్ణయించిన వేళల్లో మాత్రమే తెరుస్తారని చెప్పారు. అదేవిధంగా వ్యవసాయ సంబంధిత పనులపై ఎలాంటి ఆంక్షలు ఉండవన్నారు.
మరోవైపు.. నాందేడ్ జిల్లాలో శుక్రవారం ఉదయం మరో 34 మందికి కరోనా పాజిటివ్గా తేలడంతో మొత్తం కేసుల సంఖ్య 558కి చేరింది. మొత్తం కేసులలో 358 మంది ఇప్పటికే వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, మరో 175 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, జిల్లాలో ఇప్పటివరకు మరణించిన కరోనా బాధితుల సంఖ్య 25కు చేరింది.