
Cm Jagan Visits Srikalahasti : ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు పథకంను ప్రారంభించనున్నారు. శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో పేదలకు పట్టాలను సీఎం పంపిణీ చేయనున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఊరందూరులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
ఇక ఉదయం 9.30కు తాడేపల్లి నుంచి చిత్తూరు జిల్లాకు బయలుదేరతారు. 11.20కి ఊరందూరు చేరుకొని పైలాన్ ఆవిష్కరించి.. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తారు. అనంతరం వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేపట్టనున్నారు.
తిరిగి మధ్యాహ్నం 2.50 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు. కాగా, ఊరందూరులో వైఎస్సార్ జగనన్న కాలనీలో 167 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో 6,232 ప్లాట్లు వేశారు. వీటిలో 4,299 ప్లాట్లను పట్టణ పేదలకు, 465 శ్రీకాళహస్తి రూరల్, 1,468 ప్లాట్లు ఏర్పేడు రూరల్ ప్రాంతాలకు చెందిన పేదలకు కేటాయించారు. తొలివిడతలో భాగంగా 5,548 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.
వారం రోజులగా ఇక్కడి ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. పేదలకు పంపిణీ చేయాల్సిన స్థలాల్లో మొక్కలు నాటడం… వాటికి ట్రీగార్డుల అమరికలు కూడా పూర్తయ్యాయి.