చైనాలో నిజం దాగలేదు

|

Aug 29, 2020 | 1:09 PM

తమ దేశంలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని నాశనం చేస్తుంటే.. డ్రాగన్ కంట్రీ మాత్రం ప్రపంచచూపు మరల్చేందుకు గల్వాన్ లోయను వాడుకుంది.

చైనాలో నిజం దాగలేదు
Follow us on

తమ దేశంలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని నాశనం చేస్తుంటే.. డ్రాగన్ కంట్రీ మాత్రం ప్రపంచచూపు మరల్చేందుకు గల్వాన్ లోయను వాడుకుంది. దాయాది దేశం ఇండియాపై విషం కక్కింది. జూన్ 15వ తేదీన గల్వాన్ వ్యాలీలో దురాక్రమణకు పాల్పడి భారత సైనికులతో ఘర్షణకు దిగింది. ఈ క్రమంలో భారత్ 20 మంది సైనికులను కోల్పోయింది. అదే సమయంలో డ్రాగన్ సైనికులు కూడా భారత జవాన్ల చేతిలో 50 మందికి పైనే ప్రాణాలొదిలారని ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే, ఇప్పటివరకూ చైనా అధికారికంగా సైనికుల మరణాల లెక్కపై నోరుమెదపలేదు.

నిజాన్ని ఎంతో కాలం దాచలేరన్న చందంగా ఇప్పుడు మళ్లీ చైనాలో గల్వాన్ ఘర్షణల అంశం హాట్ టాపిక్ అయింది. తాజాగా చైనాలోని ఒక స్మశానవాటికలోని సమాధిరాయి ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చైనీస్‌ ఇంటర్నెట్‌ వీబో అకౌంట్‌లో సైనికుడి సమాధి రాయికి సంబంధించిన ఫోటో ప్రత్యక్ష‌మ‌వ‌డంతో ఆ ఫోటో చైనా, భారత్ సోషల్ మీడియాలలో వైర‌ల్ అయింది. ఈ సమాధి గల్వాన్ లోయ ఘర్షణల్లో చనిపోయిన చైనా సైనికుడు చెన్‌ జియాంగ్‌రాంగ్‌కు చెందినదిగా భావిస్తున్నారు.

సమాధిపై మాండరిన్‌ భాషలో ‘69316’ దళాల సైనికుడు, పింగ్నాన్, ఫుజియాన్ అని రాసి ఉండ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, జూన్ 2020లో భారత సరిహద్దు దళాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో వీర‌మ‌ర‌ణం పొందారు.. మరణానంతరం కేంద్ర సైనిక కమిషన్ జ్ఞాపకం చేసుకుంది అని కూడా ఉంది. పైగా, 2020 ఆగస్టు 5న దక్షిణ జిన్జియాంగ్ మిలిటరీ రీజియన్‌లో ఈ సమాధిని నిర్మించినట్లు ఫోటో తెలుపుతోంది. మరణించిన సైనికుడు 19ఏళ్ల వాడని.. అతడు 2001 డిసెంబర్‌లో జన్మించినట్లు సమాధి మీద రాసి ఉంది. ఈ ఫొటో ఇప్పుడు చైనాలో చర్చనీయాంశమైంది. అయితే, దీనిపైనా చైనా అధికారికంగా స్పందించడంలేదు.