కరోనా కారణంగా దారుణంగా నష్టపోయిన అరటి రైతులు.. రవాణా చార్జీలు కూడా రాక రైతుల విలవిల

కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ అరటి రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. సాధారణంగా నంద్యాల మార్కెట్‌లో రూ.150 నుంచి రూ.200 వరకు పలికే గెల అరటి ధర ఏకంగా రూ.50కి పతనమైంది. కనీసం రవాణా చార్జీలు కూడా రాకపోవడంతో రైతులు అరటి గెలలను మార్కెట్‌ వరకు కూడా తీసుకెళ్లకుండా...

కరోనా కారణంగా దారుణంగా నష్టపోయిన అరటి రైతులు.. రవాణా చార్జీలు కూడా రాక రైతుల విలవిల

Updated on: Dec 28, 2020 | 5:44 PM

Carona impacts ap banana farmers: కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ అరటి రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. సాధారణంగా నంద్యాల మార్కెట్‌లో రూ.150 నుంచి రూ.200 వరకు పలికే గెల అరటి ధర ఏకంగా రూ.50కి పతనమైంది. కనీసం రవాణా చార్జీలు కూడా రాకపోవడంతో రైతులు అరటి గెలలను మార్కెట్‌ వరకు కూడా తీసుకెళ్లకుండా గొర్రెలకు ఆహారంగా వేస్తున్నారు. దీన్ని బట్టే పరిస్థితులు ఎంత దారుణంగా మారాయో అర్థం చేసుకోవచ్చు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో అరటి ధరలు అమాంతం పడిపోయాయి. రూ.250 ఉండే చక్కెర కేళీ గెల అరటి.. రూ. 100కు పడిపోయింది. అరటిని ఎక్కువ కాలం నిల్వ చేసుకునే సౌకర్యం లేకపోవడంతోనే రైతులు నష్టానికి అమ్ముకుంటున్నారు. సాధారణంగా లాక్‌డౌన్‌కు ముందు ప్రతిరోజు మార్కెట్‌కు 12 వేల గెలలు వస్తుండగా.. లాక్‌డౌన్‌ సమయంలో ఆ సంఖ్య 3 వేల గెలలకు పడిపోయింది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలో అరటి పంట ఎలా ఉంది, అరటి సాగులో భారత్‌ స్థానం ఏంటి లాంటి వివరాలను ఓసారి చూద్దాం..

ఆంధ్రప్రదేశ్‌లో అరటి సాగు..

ఆంధ్రప్రదేశ్‌లో అరటిని ఎక్కువగా కర్నూలు, కడప, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావారి జిల్లాల్లో సాగు చేస్తారు. రాష్ట్రంలో.. డ్వార్ఫ్ కావెండిష్, రోబస్టా, రాస్థాలి, అమృత్ పంత్, తెల్ల చక్కరకేళీ, కర్పూర పూవన్, చక్కరకేళీ, మొంథన్, యేనుగు బొంత వంటి అరటి రకాలను పండిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం అరటి సాగు విస్తీర్ణం 74.97 వేల హెక్టార్లుకాగా 3529.15 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతోంది.

దేశంలో అరటి సాగు..

ఇక దేశం విషయానికొస్తే అరటి సాగులో తమిళనాడు, గుజరాత్‌, ఏపీ, మహారాష్ట్ర, యూపీ, కర్నాటక, మధ్యప్రదేశ్‌, బిహార్‌, కేరళ, పశ్చిమ బెంగాల్‌ ముందు వరుసలో ఉన్నాయి. 2014-15 ఏడాదికి గాను 0.80 మిలియన్ హెక్టార్లలో అరటి సాగు చేసి భారత్‌ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2014-15 లోనూ అరటి ఉత్పత్తిలో భారత్‌ తొలి స్థానంలో నిలిచింది. ప్రపంచంలో అరటి ఉత్పత్తిలో భారత్‌ వాటా ఏకంగా 27.82 శాతం. ఇక దేశంలో అరటి సాగు విస్తీర్ణంలో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా తర్వాతి స్థానాల్లో గుజరాత్‌ ఉంది. భారత్‌ నుంచి ఏటా యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్, బహ్రెయిన్, కతార్, కువైట్, నేపాల్ శ్రీలంకకు 8వేల టన్నుల అరటి ఎగుమతి జరుగుతుంటుంది. దీని విలువ రూ.150.84 కోట్లకు పైమాటే.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us