ఏపీలోని సీఎం జగన్ సర్కార్ విద్యా, వైద్యం విషయంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా విద్యార్ధుల మధ్య సామాజిక అసమానతల తొలగింపు కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వచ్చే నెల 2 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఇకపై ఏపీలోని పాఠశాల హాజరు పట్టీలో విద్యార్ధుల కులం, మతం ప్రస్తావన ఉండదు. ఇప్పటివరకు విద్యార్ధులకు రిజర్వేషన్లు, ఇతర అవసరాల కోసం నమోదు చేసిన ఈ వివరాలను ఇకపై అటెండెన్స్ బుక్ నుంచి తొలగించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయం తప్పనిసరిగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు పంపింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చిన వీరభద్రుడు ఆదేశించారు. అయితే స్కూలు రికార్డుల్లో మాత్రం కులం, మతం వివరాలు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగానే విద్యార్ధుల కులం, మతాల ఆధారాలు అందుబాటులో ఉంటాయని సమాచారం. ( ట్రాక్టర్ తిరగబడి కొడుకు మరణం, బాధ తట్టుకోలేక ఆగిన తల్లి గుండె )
మరోవైపు పాఠశాల విద్యార్ధుల అటెండెన్స్ బుక్లో బాలికల పేర్లను రెడ్ ఇంక్తో రాసే మరో విధానానికి కూడా ప్రభుత్వం స్వస్తి పలికింది. ఒకే స్కూల్లో, ఒకే క్లాస్ రూమ్లో, ఒకే తరహాలో విద్యను అభ్యసిస్తున్న బాలికలు, బాలురను వేర్వేరుగా చూపించేలా ఉన్న ఈ విధానం కూడా తొలగించాలని పాఠాశాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇకపై ఒక తరగతిలో ఉన్న అందరు విద్యార్ధుల పేర్లు ఎలాంటి కుల, మతాల ప్రస్తావన కానీ, రెడ్ ఇంక్ కానీ లేకుండా ఒకేలా ఉండనున్నాయి. ( దింపుడుకల్లం వద్ద పిలుపుకు స్పందన, ఆస్పత్రికి తీసుకెళ్తే.. )