ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..సచివాలయంలోకి వెళ్లాలంటే అది త‌ప్ప‌నిస‌రి

|

Jun 06, 2020 | 10:03 AM

కరోనా వైరస్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా ఏపీ స‌ర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ ఎంప్లాయిస్ కు ప్రత్యేక నిబంధనలు విధిస్తూ శుక్రవారం ఉత్తర్వులు రిలీజ్ చేసింది.

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..సచివాలయంలోకి వెళ్లాలంటే అది త‌ప్ప‌నిస‌రి
Follow us on

కరోనా వైరస్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా ఏపీ స‌ర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ ఎంప్లాయిస్ కు ప్రత్యేక నిబంధనలు విధిస్తూ శుక్రవారం ఉత్తర్వులు రిలీజ్ చేసింది. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. ఆరోగ్య సేతు యాప్‌ ఉన్నవారిని మాత్రమే సచివాలయంలోకి రావ‌డానికి అనుమతించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. కేవ‌లం ఉద్యోగులు మాత్ర‌మే కాదు వివిధ ప‌నుల నిమిత్తం సచివాలయ సందర్శనకు వచ్చే వారిని కూడా ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్‌ ఉంటేనే అనుమతించాలని, లేదంటే లోనికి రానివ్వొద్ద‌ని స్పష్టం చేశారు. హై రిస్క్‌ జోన్లలో ఉన్న ఉద్యోగులకు ఇంటి నుంచే సేవ‌లందించే అవ‌కాశం ఇవ్వాల‌ని పేర్కొన్నారు. విధులకు వచ్చే ఉద్యోగులకు త‌ప్ప‌నిసరిగా‌ థర్మల్‌ స్క్రీనింగ్ నిర్వ‌హించాల‌ని, శానిటైజర్లు, మాస్కులు ఉప‌యోగించాల‌ని సీఎస్ సూచించారు. ఈ నియ‌మ‌, నిబంధ‌న‌ల‌ను కఠినంగా అమలు చేయాల్సిందిగా సచివాలయ చీఫ్‌ సెక్యురిటీ ఆఫీసర్‌ను ఆదేశించారు.

ఆరోగ్య‌సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా ఆఫీసుకు వెళ్లేముందు తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివ‌రాల‌ను యాప్‌లో స్టోర్‌ చేయాలని సీఎస్ నీలం సాహ్ని సూచించారు. ఇటీవ‌ల‌ సెక్రటేరియట్ లో మూడు, నాలుగు బ్లాకుల్లో వ‌ర్క్ చేసే ముగ్గురు ఉద్యోగులకు కోవిడ్ సోక‌డంతో..అక్క‌డ విధులు నిర్వ‌ర్తించే మిగ‌తా సిబ్బందిని కూడా కార్యాల‌యానికి రావొద్ద‌ని ఆదేశించారు. సెక్రటేరియట్ లో ఉన్న అన్ని బ్లాకులను శానిటైజ్ చేశారు. పూర్తిస్థాయిలో క్రిమి సంహార‌క మందుల‌ పిచికారి ద్వారా కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోక‌కుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగులు ఆరోగ్యసేతు యాప్‌ను తప్పనిసరిగా వినియోగించాలని స‌ర్కార్ ఆదేశించింది.