
రాత్రి పడుకోగానే ప్రశాంతంగా నిద్రపడితే ఎంత హాయిగా ఉంటుందో కదా? చాలా సమస్యలకు ఈ నిద్రే పరిష్కారం. కానీ, ఆధునిక జీవనశైలిలో చాలామందికి నిద్రలేమి పెద్ద సమస్యగా మారింది. అలాంటి వారికి నిపుణులు ఒక అద్భుతమైన చిట్కాను సూచిస్తున్నారు. అదేంటంటే, రోజూ నిద్రపోయే ముందు పాదాలకు మెగ్నీషియం ఆయిల్ రాయడం. దీనివల్ల నిద్ర బాగా పట్టడమే కాదు, కీళ్ల నొప్పులు, కండరాల తిమ్మిర్లు, ఒత్తిడి, మలబద్ధకం వంటి పలు సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు.
నిద్రలేమికి పరిష్కారం:
మెగ్నీషియం ఆయిల్ ను పాదాలకు రాసి మసాజ్ చేసుకోవడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. మధ్యలో నిద్రకు ఎలాంటి అంతరాయం లేకుండా హాయిగా నిద్రపోతారు. ఈ నూనె రాయగానే మెలటానిన్ హార్మోన్ విడుదలవుతుంది. నిద్రను నియంత్రించే ఈ హార్మోన్ను మెగ్నీషియం ఆయిల్ సరైన విధంగా ప్రభావితం చేస్తుంది. తద్వారా మెదడు, శరీరం త్వరగా రిలాక్స్ అయి, బడలిక తగ్గి, గాఢ నిద్ర పట్టేందుకు సహాయపడుతుంది.
కండరాల నొప్పులకు ఉపశమనం:
రోజంతా అలసిపోయి, కండరాల నొప్పులతో బాధపడేవారికి మెగ్నీషియం ఆయిల్ గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ నూనె రాసిన వెంటనే కండరాలు రిలాక్స్ అవుతాయి, ఇన్ఫ్లమేషన్ తగ్గి, నొప్పి తగ్గుతుంది. ముఖ్యంగా రాత్రిపూట వచ్చే కండరాల తిమ్మిర్లకు, నరాల నొప్పులకు ఇది బాగా పనిచేస్తుంది. నెలసరి నొప్పులతో బాధపడే మహిళలు కూడా దీనిని పాదాలకు అప్లై చేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. చర్మం ద్వారా కణాల్లోకి ఇంకి, కండరాలకు విశ్రాంతినిస్తుంది. నిద్రలో కండరాలు పట్టేయడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
ఒత్తిడిని తగ్గిస్తుంది:
అధిక ఒత్తిడితో సతమతమయ్యేవారికి సరిగా నిద్రపట్టదు. మెగ్నీషియం ఆయిల్ ను పాదాలకు అప్లై చేయడం వల్ల సెరటానిన్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది ‘ఫీల్ గుడ్ హార్మోన్’ గా పేరు పొందింది. సెరటానిన్ విడుదలైనప్పుడు నరాలు రిలాక్స్ అయి, మెదడు నుంచి సానుకూల సంకేతాలు అందుతాయి. అంతేకాకుండా, ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ల స్థాయిలను కూడా మెగ్నీషియం ఆయిల్ తగ్గిస్తుంది. ఫలితంగా ఆందోళన తగ్గి, హాయిగా నిద్ర పడుతుంది.
మలబద్ధకం నివారణ:
మెగ్నీషియం ఆయిల్ పాదాలకు రాయడం వల్ల నిద్ర సమస్యే కాకుండా, మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. ఇది పెద్ద పేగు కండరాల్లో కదలికలను ప్రోత్సహించి, మలవిసర్జన సజావుగా జరిగేలా చేస్తుంది. శరీరంలో మెగ్నీషియం స్థాయిలు పెరిగి, జీర్ణశక్తి మెరుగుపడుతుంది. దీంతో కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. శరీరంలోని టాక్సిన్స్ను బయటకు పంపించడంలోనూ ఇది తోడ్పడుతుంది.
ఎలా వాడాలి? ముందుగా పాదాలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని, కాస్త తడిగా ఉన్నప్పుడే మెగ్నీషియం ఆయిల్ ను 5-10 సార్లు స్ప్రే చేయాలి. ముఖ్యంగా మడమల దగ్గర ఎక్కువగా స్ప్రే చేయాలి. ఆ తర్వాత కనీసం 3 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇబ్బందిగా అనిపిస్తే ఒక గంట తర్వాత శుభ్రం చేసుకోవచ్చు. వేడి నీళ్లతో స్నానం చేసిన వెంటనే అప్లై చేసుకుంటే ప్రయోజనాలు మరింత ఎక్కువగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.