
దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. రానున్న రోజుల్లో వేడిగాలుల ప్రభావం మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా అలర్ట్ అయ్యింది. తీవ్ర ఎండలు శరీరంలోని ముఖ్య భాగాలపై ప్రభావం చూపుతూ అనేక అనారోగ్య సమస్యలకు దారితీసేలా చేస్తున్నాయి. డీహైడ్రేషన్కు గురి చేయడంతో పాటు ముఖ్యంగా హీట్ వేవ్ చాలా మంది వ్యక్తుల కళ్ళను కూడా దెబ్బతీస్తుంది. అయితే వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కళ్లు దెబ్బతింటాయి. వేడి వల్ల కళ్లు మంట, పొడిబారడం వంటి కంటి సమస్యలు ఇబ్బందులు పెడుతాయి. ఓవర్ హీట్ వల్ల కళ్లలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.
హీట్ వేవ్ వల్ల కార్నియా దెబ్బతింటుందని డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు. కార్నియా దెబ్బతినడం వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. హీట్ వేవ్తో పాటు దుమ్ము నుంచి కూడా కాపాడుకోవాలని, లేకుంటే కళ్లలో అలర్జీ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇక కంటిశుక్లం, లాసిక్ లేదా గ్లాకోమా శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తులు హీట్స్ట్రోక్కు గురయ్యే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు. ఎవరైనా ఎక్కువ కాలం ఎండలో తిరిగినప్పుడు హీట్ స్ట్రోక్తో బాధపడవచ్చు. అంతే కాకుండా ఎండలో కష్టపడి పనిచేసేవారిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. హీట్ స్ట్రోక్ వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది.
హీట్ వేవ్ వల్ల కార్నియల్ బర్న్ వంటి కంటి సమస్యలు కూడా వస్తాయని ఢిల్లీకి చెందిన సీనియర్ వైద్యుడు అజయ్ కుమార్ చెబుతున్నారు. కార్నియల్ బర్న్ కంటి కార్నియాను దెబ్బతీస్తుంది. దీని వల్ల కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంది. సకాలంలో చికిత్స చేయకపోతే పరిస్థితి ప్రమాదకరంగా ఉంటుంది.
ఇలా రక్షించుకోండి
ఖచ్చితంగా సన్ గ్లాసెస్ ధరించండి.
మీ కళ్ళను తాకడానికి ముందు ఎల్లప్పుడూ మీ చేతులను కడగాలి.
మీ కళ్ళను రోజుకు రెండు మూడు సార్లు కడగాలి.
శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడానికి నీటిని తాగుతూ ఉండండి.