
చలికాలం వచ్చిందంటే చాలు.. అందరి ఇళ్లలో ఫ్రిజ్ వాటర్ ఆగిపోతుంది. పొరపాటున ఎవరైనా చల్లని నీరు తాగితే, “చలికాలంలో చల్లని నీళ్లు తాగితే జలుబు చేస్తుంది” అని ఇంట్లోని పెద్దలు హెచ్చరిస్తుంటారు. అసలు చలికాలంలో చల్లని నీరు తాగడానికి, జలుబు లేదా ఫ్లూ రావడానికి మధ్య ఏమైనా సంబంధం ఉందా? వైద్య శాస్త్రం దీని గురించి ఏం చెబుతోంది? మనలో చాలా మందికి ఉన్న ఈ సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం..
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, జలుబు లేదా ఫ్లూ రావడానికి ప్రధాన కారణం వైరస్లు. ఇవి గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. జలుబు ఉన్న వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఈ వైరస్లు ఇతరులకు సోకుతాయి. ఈ వైరస్లు నీటిలో ఉండవు, కాబట్టి చల్లని నీరు తాగడం వల్ల నేరుగా జలుబు రాదు. నిజానికి, క్రీడాకారులు తమ శరీర సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఎప్పుడూ చల్లని నీరే తాగుతుంటారు, వారికి దీని వల్ల జలుబు సోకడం లేదు కదా అని వైద్యులు ప్రశ్నిస్తున్నారు.
చలికాలంలో జలుబు, దగ్గు ఎక్కువగా రావడానికి కారణం వాతావరణంలో మార్పులే. ఈ సీజన్లో గాలిలో తేమ తగ్గి పొడిబారుతుంది. దీనివల్ల వైరస్లు ఎక్కువ కాలం జీవించడానికి, వేగంగా వ్యాపించడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే, చలి నుంచి తప్పించుకోవడానికి అందరూ కిటికీలు, తలుపులు మూసేసి ఒకే చోట గుంపుగా ఉండటం వల్ల కూడా ఇన్ఫెక్షన్లు త్వరగా సోకుతాయి.
చల్లని నీరు తాగడం వల్ల నేరుగా జలుబు రాకపోయినా, కొన్ని సందర్భాల్లో ఇది శరీరంపై ప్రభావం చూపుతుంది. చల్లని నీరు తాగడం వల్ల ముక్కులోని శ్లేష్మం గట్టిపడి, గాలి పీల్చుకోవడంలో స్వల్ప ఇబ్బంది కలగవచ్చు. ఇప్పటికే జలుబు ఉన్నవారు చల్లని నీరు తాగితే, అది గొంతులోని రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేసి నొప్పిని లేదా అసౌకర్యాన్ని పెంచుతుంది. అతిగా చల్లని నీరు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ నెమ్మదించే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మొత్తానికి చల్లని నీరు తాగడం వల్లే జలుబు వస్తుందనేది ఒక అపోహ మాత్రమే. అయితే, వాతావరణం ఇప్పటికే చల్లగా ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుకోవడానికి గోరువెచ్చని నీరు తాగడం మంచిది. జలుబు రాకుండా ఉండాలంటే తరచుగా చేతులు కడుక్కోవడం, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం మరియు ఇన్ఫెక్షన్ ఉన్నవారికి దూరంగా ఉండటం ముఖ్యం.