రాజ్యసభ ఎన్నికలకు మాజీ పీఎం దేవెగౌడ నామినేషన్
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో జేడీ-ఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ మంగళవారం బెంగుళూరులోని విధానసౌధలో తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 19 న రాజ్యసభ ఎన్నికలు..
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో జేడీ-ఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ మంగళవారం బెంగుళూరులోని విధానసౌధలో తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 19 న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక అసెంబ్లీ కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి కూడా అయిన విశాలాక్షికి ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. .దేవెగౌడ రెండో కుమారుడు, మాజీ మంత్రి రేవన్న, మూడో కుమారుడు, మాజీ సీఎం కుమారస్వామి కూడా ఆయన వెంట ఉన్నారు. దేవెగౌడ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించడంతో.. ఆయనను అభినందించేందుకు ఈ పార్టీ నేతలు, కొందరు కార్యకర్తలు కూడా విధాన సౌధ వద్దకు చేరుకున్నారు. తమ మిగులు ఓట్లను మీకే వేస్తామని కాంగ్రెస్ పార్టీ దేవెగౌడకు హామీ ఇచ్చింది. అసెంబ్లీలో జేడీ-ఎస్ కి 34 మంది ఎమ్మెల్యేలే ఉండడంతో.. రాజ్యసభ సభ్యత్వానికి అవసరమైన 44 ఓట్లను పొందాలంటే మరో 10 మంది ఎమ్మెల్యేల సపోర్టు అవసరమవుతుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ నెల 7 న దేవెగౌడకు ఫోన్ చేసి తమ పార్టీ మద్దతును ప్రకటించారు. 24 ఏళ్ళ తరువాత దేవెగౌడ రాజ్యసభలో ప్రవేశించనుండడం ఇది రెండో సారి.