
ప్రముఖ నటుడు కోట శంకరరావు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన స్నేహితుడు, దివంగత విలన్ రామిరెడ్డి చివరి రోజులు, అలాగే తెలుగు సినీ పరిశ్రమలో కాలానుగుణంగా వచ్చిన మార్పులపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఒకప్పుడు దూరదర్శన్ కాలంలో ఒక ఎపిసోడ్ షూటింగ్ రెండు మూడు రోజులు పట్టేదని, ఇప్పుడు రోజుకు నాలుగు ఎపిసోడ్లు తీస్తున్నారని ఆయన గుర్తుచేసుకున్నారు.
ఆ కాలంలో ఎస్.వి. రంగారావు వంటి నటులకే రెమ్యూనరేషన్ కేవలం వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఉండేదని శంకరరావు తెలిపారు. దూరదర్శన్ ప్రసారాలు కేవలం హైదరాబాద్ లోకల్ ప్రాంతానికే పరిమితమైనప్పటికీ, ఐదు లేదా పది నిమిషాల స్కిట్ల ద్వారానే ప్రజలు గుర్తించేవారని, ముఖ్యంగా ఆడవాళ్ళు, పిల్లలు టీవీ నటులను త్వరగా గుర్తుపట్టేవారని వివరించారు. తనను కోట శ్రీనివాసరావుగా పొరబడిన సందర్భాలను కూడా ఆయన పంచుకున్నారు.
పూర్వం సినీరంగంలోకి వెళ్లడం పట్ల కుటుంబాల్లో భయాలు ఉండేవని, ముఖ్యంగా పాడైపోతారేమో అనే ఆందోళన ఉండేదని శంకరరావు పేర్కొన్నారు. ఎంకరేజ్మెంట్ తక్కువగా ఉండేదని, ఎక్కువ మంది అమ్మాయిలతో తిరుగుతారనే అపోహలు ఉండేవని చెప్పారు. అయితే నేటి కాలంలో అవకాశాలు పెరిగాయని, చిన్న తప్పు చేసినా వెంటనే బహిర్గతమవుతుందని, ప్రజలకు తొందరగా చేరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మంచి-చెడు రెండూ త్వరగా వ్యాప్తి చెందుతాయని అన్నారు.
నటులు రామిరెడ్డి, శ్రీహరి, జయప్రకాశ్ రెడ్డిలతో తనకు మంచి స్నేహం ఉండేదని కోట శంకరరావు వెల్లడించారు. వీరందరూ రంగస్థలం నుంచి వచ్చినవారేనని, జేవీఎస్, తనికెళ్ల భరణి, ఎల్.బి. శ్రీరామ్, దివాకర్ బాబు వంటి వారంతా తన నాటకాల సహచరులేనని గుర్తు చేసుకున్నారు. రామిరెడ్డి జమా జాతకుడు అని అభివర్ణించారు. అడవిలో అన్న సినిమాలో రామిరెడ్డితో కలిసి బ్రదర్స్గా నటించినట్లు తెలిపారు.
రామిరెడ్డి మరణం గురించి మాట్లాడుతూ, ఆయన క్యాన్సర్తో మరణించారని చెప్పినప్పటికీ, మంచి ఆరోగ్యవంతుడే కదా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాగే శ్రీహరి అకాల మరణం కూడా అందరికీ షాకింగ్గా నిలిచిందని, ఆయన బాడీ అలాంటిది కాదని, షాకింగ్ న్యూస్ అని పేర్కొన్నారు. వారి కుటుంబాల ప్రస్తుత స్థితి గురించి తనకు పెద్దగా తెలియదని చెప్పారు.
మారిన సినీ పరిశ్రమ సంస్కృతి:
గతంలో నటుల మధ్య ఉన్న రిలేషన్, సామూహికంగా కూర్చుని మాట్లాడుకోవడం, భోజనం చేయడం, గోపాలరావు వంటి పెద్దల సలహాలు తీసుకోవడం వంటివి ఇప్పుడు లేవని శంకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. కారవాన్లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ గదుల్లోకి పరిమితం అవుతున్నారని, “ఎవడి గోల వాడిది” అన్నట్టు తయారైందని అన్నారు. ప్యాక్డ్ బెంచ్లు, మాటలు చెప్పేవారు కనుమరుగయ్యారని, సినీరంగంలో సంస్కృతి పూర్తిగా మారిపోయిందని ఆయన వివరించారు. వయసు అంతరం కారణంగా యువ నటులతో కూడా పూర్వపు సాన్నిహిత్యం ఉండటం లేదని పేర్కొన్నారు. చివరగా, తాను, తన తండ్రి, అన్నయ్యలు మంచి భోజన ప్రియులని, జీవితంలో భోజనానికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని హాస్యంగా తెలిపారు.
Also Read: Anantha Sriram: ‘ఆ పాట 100 మిలియన్ కొట్టింది.. రాయల్టీనే రూ.19 లక్షలు వచ్చింది’