Aadi Movie: ఆది మూవీకి ఎన్టీఆర్ హీరో.! 19 ఏళ్ల తారక్కు కథ చెప్పగానే ఆ డౌట్..
ఆది సినిమా చిత్రీకరణ సమయంలో ఎదురైన అనూహ్య ఘటనలను కెమెరామెన్ సి. రామ్ ప్రసాద్ గుర్తుచేసుకున్నారు. జూ. ఎన్టీఆర్ అంకితభావం, వి.వి. వినాయక్ విజన్ గురించి వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి మరి.

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో ఆది సినిమా ఒక ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రం ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త హీరోలకు ఒక బెంచ్మార్క్గా నిలిచింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఎదురైన అనేక అనూహ్య, ప్రమాదకరమైన ఘటనలను సినిమాటోగ్రాఫర్ సి. రామ్ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దర్శకుడు వి.వి. వినాయక్, జూ. ఎన్టీఆర్ పలు సవాళ్లను అధిగమించి ఈ సినిమాను పూర్తీ చేశారన్నారు. ఆది మూవీ కథ చెప్పినప్పుడు, 19 ఏళ్ళ కూడా లేని తారక్ ఈ సబ్జెక్ట్కు న్యాయం చేయగలడా అని ఎలాంటి సందేహం రాలేదని చెప్పారు. తారక్ సామర్థ్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ముగ్గురం కలిసి బలంగా పనిచేశామని వివరించారు. దర్శకుడు వి.వి. వినాయక్ క్రాంతి కుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్నప్పటి నుంచి తనతో స్నేహం ఉందని, వినాయక్కు మాస్ ప్రేక్షకుల నాడి తెలుసునని, షాట్స్ కంపోజిషన్లో అద్భుతమైన దార్శనికత ఉందని సి. రామ్ ప్రసాద్ పేర్కొన్నారు.
చిత్రీకరణ సమయంలో ఎదురైన ఒక ప్రమాదకరమైన సీన్ గురించి వివరిస్తూ, ఒక పాత భవనం వద్ద కెమెరాను గుంటలో పెట్టి, దాని పైనుంచి ఒక వాహనం వెళ్ళే షాట్ను తీయాల్సి వచ్చిందని తెలిపారు. జీప్ కంటిన్యూటీ సమస్యతో, వెంటనే దాని రంగును మార్చాల్సి వచ్చిందని, పెయింట్ ఆరకముందే నటీనటులను జీప్లో కూర్చోబెట్టారని ఆయన చెప్పారు. నటీనటులకు గుంటలో కెమెరా ఉందని తెలియక, డ్రైవర్ మొదటి గేర్ వేసి జీప్ను ముందుకు తీసినప్పుడు, జీప్లోని వారందరూ గుంటలో ఉన్న తన మీద పడిపోయారని, ఈ ప్రమాదంలో రఘు బాబుతో సహా పలువురు గాయపడ్డారని సి. రామ్ ప్రసాద్ వివరించారు.
క్లైమాక్స్ ఫైట్లో జూ. ఎన్టీఆర్ ఫోటో ఫ్రేమ్లను పగలగొట్టే సీన్ గురించి ప్రస్తావించారు. నిజానికి షుగర్ గ్లాస్ వాడాల్సి ఉండగా, పొరపాటున సాధారణ గాజును అమర్చారని తెలిపారు. ఎన్టీఆర్ ఆ గాజును పగలగొట్టినప్పుడు అది ఆయన చేతికి తగిలి రక్తం వచ్చిందని, అది నరాలు తెగిపోయేంత లోతైన గాయమని, ఆరు నుంచి ఏడు కుట్లు పడ్డాయని చెప్పారు. అయితే, ఆ ప్రమాదంలో కూడా ఎన్టీఆర్ షాట్ను కొనసాగించి తన అంకితభావాన్ని చాటుకున్నారని, ఆ తర్వాత “నీ నవ్వుల తెల్లదని” పాటను ఒక చేతిని కవర్ చేసి చిత్రీకరించాల్సి వచ్చిందని ఆయన వివరించారు. అంతేకాకుండా, సుమోలు పేలే సీన్ చిత్రీకరణలో మూడో ప్రధాన ప్రమాదం జరిగిందని రామ్ ప్రసాద్ తెలిపారు. ఆరు కెమెరాలతో చిత్రీకరించిన ఆ సీన్లో, ఒక పాత ట్రాక్టర్ను పేల్చాల్సి వచ్చిందని, పేలుడు సమయంలో ట్రాక్టర్ ఆక్సిల్ విరిగి, వెనుక టైరు సుమారు వంద అడుగుల ఎత్తుకు ఎగిరి నేరుగా తన కెమెరాకు తగిలిందని, తృటిలో తనకు ప్రమాదం తప్పిందని ఆయన వెల్లడించారు.
