
టాలీవుడ్లో ఒకప్పుడు తన హోమ్లీ నటనతో, స్వచ్ఛమైన చిరునవ్వుతో కుర్రకారు మనసు దోచుకున్న నటి ఆమె. ‘స్వయంవరం’, ‘ప్రేమించు’ వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగి, నంది అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. పెళ్లి తర్వాత అమెరికాలో సెటిల్ అయి వెండితెరకు దూరమైన ఈ భామ, ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు. ఇన్నేళ్లయినా ఆమె అందంలో ఏమాత్రం మార్పు లేకపోవడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని’ సినిమాతో మళ్లీ హీరోయిన్గా మెరిసిన ఆ అందాల తార.. లయ. తన ఫిట్నెస్ వెనుక ఉన్న ఆ వింతైన డైట్ సీక్రెట్ను తాజాగా ఆమె బయటపెట్టారు.
చాలా మంది డైటీషియన్లు ఉదయం అల్పాహారం తప్పనిసరి అని చెబుతుంటారు. కానీ లయ మాత్రం అసలు బ్రేక్ ఫాస్ట్ చేయరట. ఉదయం టిఫిన్ సమయానికి, మధ్యాహ్నం భోజన సమయానికి మధ్య గ్యాప్ తక్కువగా ఉండటం వల్ల ఆమె డైరెక్ట్గా 11 గంటలకే లంచ్ పూర్తి చేస్తారు. ఇక సాయంత్రం 6 గంటలకే డిన్నర్ ముగించడం ఆమె అలవాటు. మధ్యలో స్నాక్స్, పండ్లు వంటివి పెద్దగా తీసుకోరట.
లయ భోజనం చేసే పద్ధతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆమె అన్నం కంటే కూరలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. “మా ఇంట్లో వండే కూరల క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇద్దరు ముగ్గురు తినే కూరను నేను ఒక్కదాన్నే తినేస్తాను. కేవలం కూర తింటున్నానని అనిపించకుండా ఉండటం కోసమే కొద్దిగా అన్నం కలుపుకుంటాను” అని ఆమె తెలిపారు. కేవలం శాఖాహారి అయిన లయ.. ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తింటూ శరీరానికి కావలసిన పోషకాలను పొందుతున్నారు.
పాలు, కాఫీ, టీ వంటి వాటికి లయ పూర్తిగా దూరం. కానీ శరీరానికి కావలసిన కాల్షియం కోసం ఆమె పెరుగును భారీగా తీసుకుంటారు. షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ ఫుడ్ తిన్నప్పుడు కూడా పెరుగు డబ్బాలను పూర్తిగా ఫినిష్ చేస్తానని ఆమె నవ్వుతూ చెప్పారు. తనకు ఈ పద్ధతి వర్కవుట్ అవుతోంది కాబట్టి అలాగే కంటిన్యూ చేస్తున్నానని, ఇది అందరికీ సెట్ అవుతుందని తాను చెప్పడం లేదని ఆమె స్పష్టం చేశారు.
ఎలాంటి కఠినమైన డైట్ నియమాలు పెట్టుకోకుండా, తనకు నచ్చిన రీతిలో పోషకాలను తీసుకుంటూ లయ తన అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఆమె రీ ఎంట్రీలో వరుస సినిమాలు చేస్తూ నేటి తరం హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు.