ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ తర్వాత అంతటి క్రేజ్.. ఒకే హీరోయిన్‌తో 30కిపైగా సినిమాలు.. కానీ ఆ కారణంతో కెరీర్ ఖతం

తెలుగు చిత్ర పరిశ్రమలో నటరత్న ఎన్టీఆర్ తర్వాత అంతటి అందగాడు, ఆజానుబాహుడు ఎవరయ్యా అంటే ఆ రోజుల్లో అందరూ హరనాథ్ పేరు చెప్పేవారు. సాంఘిక చిత్రాలే కాకుండా పౌరాణిక, చారిత్రక, జానపద చిత్రాల్లో నటించి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాతి వరుసలో నేనున్నానంటూ నిరూపించుకున్నారు హరనాథ్.

ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ తర్వాత అంతటి క్రేజ్.. ఒకే హీరోయిన్‌తో 30కిపైగా సినిమాలు.. కానీ ఆ కారణంతో కెరీర్ ఖతం
Haranath

Updated on: Sep 06, 2026 | 6:01 PM

తెలుగు సినీ చరిత్రలో ఎందరో నటులు తమదైన ముద్ర వేశారు. కొందరు విజేతలుగా నిలిస్తే, మరికొందరు పరాజయాలను చవిచూశారు. కానీ, విజేతగా నిలిచి, ఆ తర్వాత దురదృష్టవశాత్తు ఓటమి పాలైన అతి కొద్ది మందిలో నటుడు హరనాథ్ ఒకరు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి స్టార్స్ మధ్య ఒక స్టార్‌గా వెలుగొంది. చివరి జీవితంలో ఆర్థిక, మానసిక ఇబ్బందులతో సతమతమైన హరనాథ్ జీవితం అనేక పాఠాలను అందిస్తుంది. ఈ విషాద గాథను సీనియర్ జర్నలిస్ట్ జీఆర్ మహర్షి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. పిఠాపురం రాజా వారి కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన హరనాథ్, యువరాజు లాంటి వ్యక్తిత్వం కలవారని. ఆయనకు సినిమా ఫీల్డ్ ఒక ప్రత్యామ్నాయం మాత్రమే. వాస్తవానికి, ఆయన పైలట్ కావాలనే కోరికతో మద్రాస్ వచ్చారు. అక్కడ ఒక ఆర్ట్ డైరెక్టర్ ఆయన అందాన్ని చూసి, గుత్తా రామిణీడుకి పరిచయం చేయడంతో సినీ రంగ ప్రవేశం జరిగింది. మా ఇంటి మహాలక్ష్మి చిత్రంతో తెరంగేట్రం చేసిన హరనాథ్, ఆ చిత్రం విజయంతో అనూహ్యమైన గుర్తింపు పొందారు.

హరనాథ్ జీవితంలో అతి పెద్ద మలుపు ఎన్టీఆర్ శ్రీరామచంద్రుడు పాత్రకు ఆయనను ఎంచుకోవడం. తన సినిమాలో రావణాసురుడి పాత్ర పోషిస్తూనే, శ్రీరాముడిగా హరనాథ్‌ను ఎంచుకోవడం ఎన్టీఆర్ గొప్ప మనసుకు నిదర్శనం. ఆ తర్వాత హరనాథ్ వెనుతిరిగి చూడలేదు. భీష్మలో శ్రీకృష్ణుడిగా, భక్త ప్రహ్లాదలో శ్రీమహావిష్ణువుగా, పాండవ వనవాసంలో అభిమన్యుడిగా వంటి అనేక పౌరాణిక పాత్రల్లో మెప్పించారు. ఆయన నటనలో ఒక సహజత్వం ఉండేది. పాత్రలో లీనమైపోయే ఆయన తీరు, తాను నటిస్తున్నట్లు కాకుండా, ఆ పాత్రకు ప్రాణం పోసినట్లు ఉండేది. గుండమ్మ కథలో కేవలం పద పద్మ పోదాం అనే ఒకే ఒక్క డైలాగ్‌తో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత తెలుగు చిత్రసీమలో మూడో స్థానంలో హరనాథ్ పేరు చెప్పుకునే కాలం చాలా కాలం కొనసాగింది.

అయితే, 1960ల మధ్యలో శోభన్‌బాబు, కృష్ణ వంటి నటులు ప్రవేశించడంతో పోటీ పెరిగింది. మరోవైపు, సినిమా షూటింగ్‌ల ఒత్తిడి, సెలబ్రిటీ హోదా, స్నేహితుల ప్రభావం హరనాథ్‌ను వ్యసనాల వైపు నడిపించాయి. రోజంతా కష్టపడిన తర్వాత కొంత విశ్రాంతి కోసం మద్యం అలవాటు చేసుకున్న ఆయన, అది క్రమంగా నియంత్రణ కోల్పోయి వ్యసనంగా మారింది. షూటింగ్‌లకు ఆలస్యంగా రావడం, హాంగోవర్ కారణంగా తోటి నటీనటులు ఇబ్బంది పడటం వంటి సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా నటి జమున గారు ఆయనతో 30కి పైగా చిత్రాలలో నటించారు, ఆయన వ్యసనం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారని జీఆర్ మహర్షి వెల్లడించారు. క్రమంగా అవకాశాలు తగ్గడం, తన స్థానం కోల్పోవడం, వ్యసనం నుంచి బయటపడలేకపోవడం వంటి కారణాలతో హరనాథ్ డిప్రెషన్‌లోకి వెళ్లారు. సక్సెస్ ఉన్నప్పుడు చుట్టూ ఉన్న జనం ఫెయిల్యూర్ రాగానే మాయమైపోవడం, గౌరవం తగ్గడం వంటివి ఆయనను మరింత ఏకాకిని చేశాయి. నటి జమున గారు తన కెరీర్ క్రైసిస్‌లో ఉన్నప్పుడు హరనాథ్ అండగా నిలిచినందున, హరనాథ్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జమున గారు ఆయనను ఆదుకోవడానికి ప్రయత్నించారు. ఎన్టీఆర్ కూడా హరనాథ్‌ను పిలిచి సరైన మార్గంలో నడవమని హితవు పలికారు. అయినప్పటికీ, హరనాథ్ తన వ్యసనాలతో పోరాడి, చివరికి పరాజయం పాలయ్యారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us