
ఇప్పుడు ఆ మేజిక్ మళ్ళీ పునరావృతం కాబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి నెట్టింట చక్కర్లు కొడుతున్న ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సినీ ప్రియుల్లో జోష్ నింపుతోంది. ఒకరు నటనలో ‘మక్కల్ సెల్వన్’ అనిపించుకుని విలక్షణ పాత్రలతో దూసుకుపోతున్నారు. మరొకరు వెండితెరపై దృశ్యకావ్యాలను ఆవిష్కరించడంలో దిట్ట. వీరిద్దరూ కలిస్తే అది కేవలం సినిమా కాదు, ఒక కళాఖండం అవుతుంది. గతంలో వీరు కలిసి చేసిన ఒక యాక్షన్ డ్రామా మనందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ అదే క్రేజీ కాంబో పట్టాలెక్కడానికి సిద్ధమైంది.
అయితే ఈసారి వీరితో పాటు ఒక ‘నేచురల్ బ్యూటీ’ కూడా జతకట్టబోతోంది. తన డ్యాన్స్ తో, నటనతో దక్షిణాది ప్రేక్షకులను మాయ చేసిన ఆ సుందరి మణిరత్నం సినిమాలో మెరవబోతోందనే వార్త ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్లో సంచలనంగా మారింది. ఆ మ్యాజికల్ కాంబో మరెవరో కాదు.. విజయ్ సేతుపతి-మణిరత్నం-సాయి పల్లవి.
మద్రాసు టాకీస్ బ్యానర్పై లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో రూపొందిన ‘చెక్క చివంద వానమ్’ (తెలుగులో ‘నవాబ్’) చిత్రంతో విజయ్ సేతుపతి, మణిరత్నం ఇప్పటికే మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఇప్పుడు రాబోతున్న కొత్త సినిమా మునుపటి ప్రాజెక్ట్ కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుందని విజయ్ సేతుపతి స్వయంగా వెల్లడించారు. ఇది ఒక విభిన్నమైన జోనర్ లో సాగే కథ అని, మణిరత్నం మార్కు మేకింగ్ తో సాగుతుందని తమిళ సినీ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఇందులో కథానాయికగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవిని సంప్రదించారట. మణిరత్నం సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఆ పాత్రకు సాయి పల్లవి అయితేనే సరైన న్యాయం చేస్తుందని భావించిన దర్శకుడు ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. కథ విన్న సాయి పల్లవి, అందులోని తన పాత్ర నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. విజయ్ సేతుపతి, సాయి పల్లవి ఇద్దరూ సహజ సిద్ధమైన నటనకు పెట్టింది పేరు. వీరిద్దరూ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే అది ప్రేక్షకులకు కనువిందుగా మారడం ఖాయం.
ప్రస్తుతం విజయ్ సేతుపతి, సాయి పల్లవి ఇద్దరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సాయి పల్లవి ‘రామాయణ’ వంటి భారీ సినిమాల్లో నటిస్తోంది. మణిరత్నం కూడా ఈ ప్రాజెక్టును త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడితే అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. మరి ఈ అద్భుతమైన కాంబినేషన్ వెండితెరపై ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి. విజయ్ సేతుపతి నటన, మణిరత్నం విజన్, సాయి పల్లవి నేచురాలిటీ.. ఈ మూడు తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయాల్సిందే.