ఆ అద్భుత దృశ్యకావ్యం సీక్వెల్‌ కోసం జాన్వీ ఒప్పుకుంటుందా..!

| Edited By: Pardhasaradhi Peri

May 09, 2020 | 6:06 PM

చిరంజీవి, శ్రీదేవి జంటగా రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' విడుదలై ఇవాళ్టికి 30 సంవత్సరాలు పూర్తి అయ్యింది.

ఆ అద్భుత దృశ్యకావ్యం సీక్వెల్‌ కోసం జాన్వీ ఒప్పుకుంటుందా..!
Follow us on

చిరంజీవి, శ్రీదేవి జంటగా రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ విడుదలై ఇవాళ్టికి 30 సంవత్సరాలు పూర్తి అయ్యింది. సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో క్రియేట్ చేసిన సెన్సేషన్‌ను టాలీవుడ్‌ ప్రేక్షకులెవ్వరు మర్చిపోరు. ఆ సమయంలో ఉమ్మడి రాష్ట్రాల్లో భారీ తుఫాను ఉన్నప్పటికీ.. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల రికార్డులను క్రియేట్ చేసింది. కాగా ఈ సినిమాకు సీక్వెల్‌ కచ్చితంగా ఉంటుందని.. దాన్ని తీసిన తరువాతే రిటైర్‌ అవుతానని నిర్మాత అశ్వనీదత్ ఇటీవల ప్రకటించారు. దీంతో ఈ సినిమా సీక్వెల్‌ మరోసారి తెరపైకి వచ్చింది.

అయితే ఈ సీక్వెల్‌లో ఎవరు నటిస్తారు..? ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ మూవీ సీక్వెల్‌లో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఉంటాడని తెలుస్తున్నప్పటికీ.. హీరోయిన్‌గా శ్రీదేవీ తనయ జాన్వీ ఒప్పుకుంటుందా..? లేదా..? అన్నది అందరిలో మెదలుతోంది. దఢక్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. ప్రస్తుతం కేవలం హిందీ సినిమాల్లోనే నటిస్తోంది. ఈ అమ్మడిని సౌత్‌లోకి తీసుకురావాలని అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌ దర్శకనిర్మాతలు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సౌత్‌పై పెద్దగా ఆసక్తిని చూపిన జాన్వీ.. ఈ సీక్వెల్‌లో నటించేందుకు ఒప్పుకుంటుందా..? అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. కాగా శ్రీదేవీ బతికున్న సమయంలో జగదేక వీరుడు అతిలోక సుందరి గురించి మాట్లాడిన ఆమె.. తన పాత్రలో ఇప్పటి హీరోయిన్లలో తమన్నా సరిపోతుందని పేర్కొన్న విషయం తెలిసిందే. మరి అసలు ఈ సీక్వెల్ ఎప్పుడు తెరకెక్కుతుంది..? జగదేక వీరుడు-అతిలోక సుందరి సీక్వెల్‌లో చిరు, శ్రీదేవీల వారసులు నటించబోతున్నారా..? వంటి ప్రశ్నలన్నింటికి సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read This Story Also: కార్ పార్కింగ్ గొడవ.. ప్రముఖ కబడ్డీ ప్లేయర్‌ను కాల్చి చంపిన పోలీసు..!