కరోనా లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియా ద్వారా అందరిలో మానసిక స్థైర్యాన్ని పెంచుతున్నారు రాక్స్టార్ దేవీ శ్రీ ప్రసాద్. ఆ మధ్యన యూట్యూబ్లో ఓ సారి లైవ్ ఇచ్చిన ఈ మ్యూజిక్ డైరెక్టర్.. ఆ తరువాత యూట్యూబ్ ఇండియా కంటెక్ట్ చేసిన షోలోనూ పాల్గొన్నారు. ఇక ఇటీవల ద మూన్ పేరుతో ఆయన తీసిన ఓ చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మన జీవితంలో కన్నీళ్లు-నవ్వులు, ఎత్తుపళ్లాలు వస్తూ పోతుంటాయని.. అలాగే ఇప్పుడున్న ఈ పరిస్థితి కూడా కచ్చితంగా పోతుంది అంటూ ఆయన ఆ వీడియోలో మెసేజ్ ఇచ్చారు. ఈ వీడియోపై సర్వత్రా ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
లాక్డౌన్ను ఎలా స్పెండ్ చేస్తున్నారు అని అడగ్గా.. లాక్డౌన్ అంటే ఏంటి. నాకు 24 గంటలు సరిపోదు. నేను రీరికార్డింగ్ పనులు, పాటలు కంపోజ్ చేయడంలో బిజీగా ఉన్నా. అలాగే పలు దేశాలకు నేను వెళ్లినప్పుడు అక్కడి నుంచి కొన్ని సంగీత వాయిద్యాలను తెచ్చుకుంటూ ఉంటా. ఇన్ని రోజులు వాటిని నేర్చుకోవడం కుదరలేదు. ఇప్పుడు నేర్చుకుంటున్నా అని అన్నారు.
ఇక ఉప్పెన నుంచి వచ్చిన రెండు పాటలు అందరినీ ఆకట్టుకుంటుండగా.. మూడో పాట ఎప్పుడు అని అడగ్గా.. అది ఇప్పటికే రావాల్సి ఉండేది. కానీ కరోనా ఆపేసింది. ఈ మూవీకి రిలీజ్ డేట్ లాక్ చేసిన తరువాత పాటల విడుదలపై ఒక క్లారిటీ వస్తుంది. ఈ మూవీ ఔట్పుట్ చాలా బాగా వచ్చింది. ఆర్ఆర్ చేసే సమయంలో ఇది కచ్చితంగా మంచి సినిమా అవుతుందని అనిపించింది అని అన్నారు. అలాగే రంగ్దే పాటలు కూడా అందరికీ నచ్చుతాయని.. ఎందుకంటే ఇది మంచి రొమాంటిక్ కథాంశమని రాక్స్టార్ వివరించారు. ఇక పవన్ కల్యాణ్తో మరోసారి పనిచేసే విషయంపై స్పందిస్తూ.. అధికారిక ప్రకటన వచ్చిన తరువాత మీకే తెలుస్తుంది. ఇప్పుడు మీకు నేను చెప్పడం బావుండదు అని అన్నారు. ఇక పెళ్లెప్పుడు అన్న ప్రశ్నకు.. ఆ ఒక్కటి అడక్కండి అని దేవీ పేర్కొన్నారు. అంటే ఏదైనా లవ్ ఫెయిల్యూర్ ఉందా అన్న ప్రశ్నకు.. నాకు ఫెయిల్యూరా.. అలా ఏం లేదు. కానీ ఆ ఒక్కటి మాత్రం అడక్కండి అంటూ తప్పించుకున్నారు.
Read This Story Also: వాటినే కరోనా మరణాలుగా గుర్తించండి: ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలు