Telugu Academy: తెలుగు అకాడమి నిధులు దుర్వినియోగంపై సంచలన కామెంట్లు చేసిన చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి

|

Oct 01, 2021 | 12:51 PM

తెలుగు అకాడమికి సంబంధించిన నిధులు దుర్వినియోగం అవ్వడం నిజమేనని తెలుగు అకాడమి చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి చెప్పారు.

Telugu Academy: తెలుగు అకాడమి నిధులు దుర్వినియోగంపై సంచలన కామెంట్లు చేసిన చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి
Lakshmi Parvathi
Follow us on

Nandamuri Lakshmi Parvathi: తెలుగు అకాడమికి సంబంధించిన నిధులు దుర్వినియోగం అవ్వడం నిజమేనని తెలుగు అకాడమి చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి చెప్పారు. అయితే, ఇందులో ప్రభుత్వం నిర్లక్ష్యముందా లేక, అకాడమీ సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నదా అనేది కమిటీ తేలుస్తుందని ఆమె అన్నారు. తెలంగాణ తెలుగు అకాడమీ హస్తం ఉన్నట్లు తెలుస్తోందన్న ఆమె, ఇది తెలుగు భాషకి, ప్రభుత్వాన్ని మోసం చేసినట్లేనని ఆమె పేర్కొన్నారు. “బ్యాంకు ఇన్వాల్మెంట్ కూడా కనిపిస్తుంది. ఈ ఘటనపై మేము చాలా బాధ పెడుతున్నాము. రాష్ట్రాలు విడిపోయిన వెంటనే ఎవరి వాటా వాళ్ళుకు పంచితే ఇలాంటి ఇబ్బందులు తలెత్తేవి కావు. 58:42 రేషియే ప్రకారం 58 శాతం ఆంధ్రాకి వాటా రావాలి. సుప్రీంకోర్టు సూచనలు ప్రకారమే వాటాలు జరుగుతాయి. ఒకటిన్నర సంవత్సరంలో అకాడమీని చాలా ముందుకు తీసుకు వచ్చాము. త్వరలో తిరుపతిలో తెలుగు అకాడమీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాము.” అని టీవీ9 తో ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి విజయవాడలో ఇవాళ మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా, తెలుగు అకాడమి స్కాంలో దర్యాప్తు వేగవంతమైంది. ఇంటిదొంగల పనేనని ప్రాథమికంగా నిర్దారించారు సీసీఎస్ పోలీసులు. బ్యాంకు అధికారులతో చేతులు కలిపి నిధులు కాజేసినట్టు గుర్తించారు. ఇప్పటివరకు రూ. 71 కోట్లు దారి మల్లించి కాజేసిన నిందితులు.. ఈ కుంభకోణానికి సంబంధించి మూడు కంప్లైంట్స్‌ ఇచ్చారు తెలుగు అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి. ఈ ఫిర్యాదులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మాయమైన నిధులు ఎక్కడికి తరలించారు? అన్న అంశంపై విచారణ జరుపుతున్నారు పోలీసులు. నిధుల గోల్ మాల్‌లో అకాడమీ, బ్యాంక్ అధికారుల ప్రమేయం ఉన్నట్లు పోలీసుల నిర్దారణకు వచ్చారు. అకాడమీలోని ముగ్గురు ఉద్యోగుల పాత్రపై ఆరా తీస్తున్నారు. యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బిఎల్, అగ్రసేన్ బ్యాంక్ ప్రతినిధులను గురువారం విచారించిన పోలీసులు..శుక్రవారం మరోసారి బ్యాంక్ అధికారులను అకాడమీ ఉద్యోగులను ప్రశ్నించనున్నారు.

తెలుగు అకాడమీకి సంబంధించిన ఫిక్స్ డ్ డిపాజిట్ల అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన శాఖాపరమైన కమిటీని ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనర్‌ ఒమర్‌ జలీల్‌, అకౌంట్స్ ఆఫీసర్ రాంబాబు, జాయింట్ డైరెక్టర్, కమిషనర్ కాలేజీ ఎడ్యుకేషన్ యాదగిరి సభ్యులుగా ఉన్నారు. అక్టోబర్ 2లోగా ఈ కమిటీ విచారణ జరిపి ప్రాథమిక నివేదికను ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది ప్రభుత్వం. హిమాయత్‌నగర్‌లో తెలుగు అకాడమీ దశాబ్దాలుగా కార్యలపాలు నిర్వహిస్తుంది. ఉమ్మడి ఆస్తుల జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు పంచాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు తెలుగు అకాడమీలో ఉన్న రూ. 213 కోట్ల రూపాయల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాటా రూ. 125 కోట్లు ఇవ్వడానికి అకాడమీ సిద్ధం అయ్యింది.

భవనాలు, నగదు వివరాలను లెక్కిస్తుండగా.. వివిధ బ్యాంక్‌లతోపాటు యూబీఐ కార్వాన్‌, సంతోష్‌నగర్‌ శాఖల్లో రూ. 43 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయని తేలింది. వీటిని గడువు తీరకముందే తీసుకోవాలని అకాడమీ అధికారులు నిర్ణయించారు. అయితే రూ. 43 కోట్ల రూపాయలు విత్‌డ్రా చేసేందకు ప్రయత్నించగా ఆసలు బ్యాంక్‌లో డబ్బులు లేవని తేలింది. సెప్టెంబరు 22న డబ్బులు కోసం తెలుగు అకాడమీ అధికారులు బ్యాంక్‌కు వెళ్లగా.. తర్వలో ఇస్తామని అధికారులు చెప్పారు. మళ్ళీ అడగ్గా ఆసలు నిధులు లేవని బ్యాంక్ మేనేజర్ మస్తాన్ అలీ పేర్కొన్నారు. దీంతో అకాడమీ డైరెక్టర్‌ సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం లావాదేవిలో బ్యాంక్ మేనేజర్ పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూ. 43 కోట్లలో రూ. 23 కోట్లు వేరే బ్యాంక్‌కు బదిలీ అయినట్టు తెలుస్తోంది. ఎవరు ఈ స్కామ్‌కి పాల్పడ్డారో తేల్చేపనిలో పడ్డారు అధికారులు.

Read also: Kisan Panchayat: కిసాన్‌ పంచాయత్లకు సుప్రీంకోర్టు చీవాట్లు