గత కొద్ది రోజులుగా చమురు ధరలు.. వాహనదారులకు ఝలక్ మీద ఝలక్ ఇస్తున్నాయి. వారికి తెలియకుండానే జేబులకు చిల్లులు పెడుతున్నాయి ఆయిల్ కంపెనీలు. గత 18 రోజులుగా ఇప్పటివరకూ వాహనదారులపై అదనంగా రూ.10 వరకూ భారం పడింది. అసలే లాక్డౌన్తో పెరిగిన రేట్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులకు ఒక లీటర్పై ఉన్నట్టుండి పది రూపాయలు పెరగడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా రోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు సగటున 40 నుంచి 60 పైసల మధ్య పెరుగుతూ వస్తున్నాయి. జూన్ 7వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా చమురు ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. జూన్ 7న హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.74.59, లీటర్ డీజిల్ ధర రూ.68.40 ఉండగా.. ఈ రోజు (జూన్ 25వ తేదీన) పెట్రోల్ లీటర్ రూ.82.96, డీజిల్పై రూ.78.19కు పెరిగింది.
అసలే కరోనా కష్ట కాలం.. ఆపై అంతంత వచ్చే ఆదాయంతో సతమతమవుతున్న వారికి.. చమురు ధరలు మరింత భారంగా మారాయి. క్యాబ్లు, ఆటోవాలాలు, ఇతర ప్రైవేటు వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. కరోనా ప్రభావంతో ప్రయాణికుల సంఖ్య తగ్గడం, పారిశుద్ధ్యం కోసం అయ్యే ఖర్చుతో పాటు ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో మరింత ఇబ్బందులకు గురి అవుతున్నట్లు వారు వాపోతున్నారు.
ఇక హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్రోల్ బంకులు కలిపి దాదాపు 640 వరకూ ఉన్నాయి. రోజుకు సుమారు 25 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారు. ఈ లెక్కన సామాన్యుడిపై పెట్రోల్పై సుమారు 2.2 కోట్లు, డీజిల్పై రూ.2.7 కోట్లు అదనపు భారం పడుతోంది.