రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం అభినందనీయమని జనసేన అధినేత పవన్కల్యాణ్ ప్రశంసించారు. ఆర్బీఐ నిర్ణయం సన్న, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకులకు ఎంతో మేలుచేస్తుందన్నారు.
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రుణాలు చెల్లింపులపై మూడు నెలలు మారటోరియం విధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం అభినందనీయమని జనసేన అధినేత పవన్కల్యాణ్ ప్రశంసించారు. అన్నిరకాల రుణాల చెల్లింపుపై మూడు నెలల మారటోరియం విధిస్తూ ఆర్బీఐ ప్రకటన అనంతరం ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ నిర్ణయం సన్న, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. నగదు క్రెడిట్, ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లింపులు వాయిదాకు అనుమతించడం లాభదాయకమన్నారు. ఇటువంటి సంక్షోభ సమయంలో ప్రజలకు ఎంతో భరోసానిచ్చే అంశం ఇదని పేర్కొన్నారు.
కాగా, మారటోరియం పై రిజర్వ్ బ్యాంక్ క్లారిటి ఇస్తూ, క్రెడిట్ కార్డు రుణాలు, బకాయిలకు మూడు నెలల మారటోరియం వర్తించదని పేర్కొంది. ఆ చెల్లింపులను నిబంధనల ప్రకారమే వినియోగదారులు తప్పకుండా చెల్లించాలని స్పష్టం చేసింది. టర్మ్ లోన్స్ లో భాగంగా ఉండే… అంటే, గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాలు వంటి వాటికి మాత్రమే ఈ కష్టకాలంలో ఊరట లభిస్తుందని ఆర్బీఐ పేర్కొంది.