
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అన్ని దేశాలను వణికిస్తోంది. ఇప్పటి వరకు 22లక్షల మంది కరోనా బారిన పడగా.. ఇందులో లక్షన్నరకు పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ మహమ్మారి పాకిస్థాన్ను కూడా అతలాకుతలం చేస్తోంది. తాజాగా.. పాక్కు కరోనా టెన్షన్ మరింత పెరిగింది. అందుకు కారణం.. రంజాన్ మాసం దగ్గరపడుతుంటే.. తబ్లీఘీ సభ్యుల జాడ దొరక్కపోవడం. ఎందుకంటే.. పాకిస్థాన్లోని లాహోర్లో గత మార్చి నెలలో తబ్లీఘీలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి విదేశీయులు కూడా రావడం.. వారి ద్వారా కరోనా పాజిటివ్ సోకడం పాకిస్థాన్లో కరోనా కేసులకు ఆజ్యం పోసినట్లైంది. ఈ సమేవేశంలో వేల మంది పాక్లోని తబ్లీఘీ సభ్యులు పాల్గొన్నారు. అయితే వీరందరి అడ్రసులు కనుక్కునేందుకు ఎంత ప్రయత్నం చేసినా.. అందర్నీ ట్రేస్ చేయలేకపోతోంది. ఇదే ఇప్పుడు పాక్ను కలవరపెడుతోంది.
త్వరలో రంజాన నెల ప్రారంభం కానుండటంతో.. కరోనా నుంచి బయటపడేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై పాక్ ప్రభుత్వ వర్గాల్లో ఏకాభిప్రాయం కుదరట్లేదు. పూర్తిగా లాక్డౌన్ విధించాలని ఓ మంత్రి అంటే.. మరోకరు దీనిని వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం తన మనసులోని మాట బయటపెట్టకుండా.. ఇంకా జాప్యం చేస్తున్నారు. మరోవైపు ఇంకో మంత్రి.. అసలు పాక్లో కరోనా కేసులు పెరగడానికి తబ్లీగీ సమావేశాలే కారణమంటూ బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. అయితే ఇవన్నీ ఇలా ఉంటే.. ఇప్పుడు తబ్లీఘీలకు ఎంతమందికి కరోనా సోకిందన్న దానిపై టెన్షన్ మొదలైంది. వారందర్నీ ఎంత త్వరగా ట్రేస్ చేసి పరీక్షలు చేస్తేనే.. కరోనాను కట్టడి చేయవచ్చన్న అభిప్రాయం పాక్ మంత్రుల్లో ఉంది.