ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే 34 లక్షల మందికి పైగా కరోనా బారినపడగా.. వీరిలో పది లక్షలకు పైగా కరోనాను జయించి.. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అంతేకాదు దాదాపు మరో రెండున్నర లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ క్రమంలో అన్ని దేశాలు దాదాపు లాక్డౌన్ కొనసాగిస్తున్నాయి. అంతేకాదు.. షాపింగ్ మాల్స్, ఫుడ్ కోర్ట్స్, మత పరమైన ప్రార్ధనా మందిరాలను మూసివేశారు. అయితే తాజాగా ఇరాన్ కొన్నింటిని సడలిస్తూ.. సంచలన నిర్ణయం తీసుకుంది.
కరోనా మహమ్మారి కట్టడి నేపథ్యంలో అమలు చేస్తున్న ఆంక్షలను క్రమక్రమంగా సడలించేందుకు ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహానీ.. మసీదుల ఓపెనింగ్ విషయంపై స్పందించారు. కొత్తగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాని ప్రాంతాల్లో మసీదులను తిరిగి తెరవబోతున్నట్లు ప్రకటించారు. దేశంలో అత్యంత తక్కువ రిస్క్ ఉన్న ప్రదేశాల్లోనే మసీదులను తెరవబోతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 132 ప్రాంతాల్లోని మసీదులను సోమవారం నుంచి తెరిచేందుకు పర్మిషన్ ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు.. శుక్రవారం సామూహిక ప్రార్థనలకు కూడా అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే కరోనా విషయంలో పాటించాల్సిన నియమాలను పాటించాలని ప్రజలకు తెలిపారు. ఇక ప్రార్ధనల విషయంలో సోషల్ డిస్టెన్స్ పాటించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.