తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది.. గత రెండు రోజులుగా వందకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికం హైదరాబాద్లోనే నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులపై భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎమ్ఆర్) సర్వెలైన్స్ శనివారం నుంచి రెండు రోజుల పాటు సర్వే నిర్వహించనుంది. శని, ఆదివారాల్లో ఎన్ఐఎన్ టీమ్స్ ఈ సర్వే నిర్వహించనున్నాయి. హైదరాబాద్లోని 5 కంటైన్మెంట్ జోన్లలో రెండు రోజుల పాటు జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) టీమ్స్ ఈ సర్వే నిర్వహించనున్నాయి.
గ్రేటర్ పరిధిలోని 5 కంటైన్మెంట్ జోన్లు.. ఆదిభట్ల, బాలాపూర్, మియాపూర్, చందానగర్, టప్పాచబుత్రలో రెండు రోజుల పాటు అధికారులు సర్వే చేయనున్నారు. ఈ ఐదు కంటైన్మెంట్ జోన్లలో కరోనా కేసులు, వాటి పరిస్థితి, లక్షణాలపై ఇంటింటా సర్వే నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రతి జోన్కు 2 చొప్పున 10 ప్రత్యేక టీమ్ల ద్వారా సర్వేకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో తెలంగాణలోని జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఇప్పటికే సర్వే జరిపారు.
ICMR నివేదికల ఆధారంగానే లాక్డౌన్ పొడిగింపుపై కేంద్రం నిర్ణయం తీసుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సర్వే చేపట్టారు. హైదరాబాద్లో పెరుగుతున్న కేసులు, లక్షణాలు లేనటువంటి కేసులపై ఐసీఎంఆర్ పూర్తిస్థాయి నివేదిక తయారుచేయనుంది. ఆ నివేదికను కేంద్ర వైద్యఆరోగ్యశాఖకు సమర్పిస్తారు. నివేదిక ఆధారంగానే లాక్డౌన్ పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మే 31తో లాక్డౌన్ 4 ముగియనున్న సంగతి తెలిసిందే.