
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరింత ఉద్ధృతమవుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నిర్ధారణ అవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,58,086కి చేరింది. దేశంలో అత్యధిక కరోనా కేసులతో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ వరుస క్రమంలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్లో మరణాల సంఖ్య ఏమాత్రం తగ్గడంలేదు. బుధవారం మరో 23 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాలు 938కి చేరాయి. ఒక్క అహ్మదాబాద్ నగరంలోనే 764 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్పై పోరుకు గుజరాత్ ప్రభుత్వం ధన్వంతరి రథ్ను రంగంలోకి దించింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్డౌన్-4.0 మరో మూడు రోజుల్లో ముగుస్తుండగా..గుజరాత్లో ఐదోసారి లాక్డౌన్ పొడిగించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరో వైపు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు గుజరాత్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధన్వంతరి రథ్ వాహనాలను ముందుగా అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో అందుబాటులోకి తెచ్చింది. మొత్తం 50 వాహనాలను ప్రారంభించింది. 14 కంటైన్మెంట్లలోని 200 చోట్ల వీటిని ఉంచి ప్రజలకు వైద్యం అందించారు. ప్రస్తుతం 84 రథాలను అందుబాటులోకి తెచ్చారు. వీటిని 336 ప్రాంతాల్లోని ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. వీటి ద్వారా స్థానిక ప్రజలకు మంచి వైద్యం అందిస్తున్నారు. ఒక్కో వాహనంలో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, ఫార్మాసిస్టులు అందుబాటులో ఉంటున్నారు.
ధన్వంతరి రథ్ వాహనాల వద్ద.. థర్మల్ గన్తో శరీర ఉష్ణోగ్రత చెక్ చేస్తున్నారు. సదరు వ్యక్తికి మధుమేహం, బీపీ పరీక్షించి తదితర సమాచారాన్నంతా నమోదు చేస్తున్నారు. ఆక్సిజన్ స్థాయిలను పరీక్షించేందుకు ఆక్సీ మీటర్లను కూడా అందుబాటులో ఉంచారు. అవసరమైతే రోగికి పారాసిటమాల్, సిట్రిజెన్, అజిత్రోమైసిన్ టాబ్లెట్లు అందిస్తున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు హోమియోపతి ముందులు, ఆయుర్వేద మందులు కూడా అందిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 71 వేల మంది ధన్వంతరి రథ్ వల్ల లబ్ధి పొందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసులు కూడా ప్రభావవంతంగా తగ్గుముఖం పట్టాయని చెప్పారు.