పెళ్లంటే అందరికీ గుర్తిండిపోయేలా అంగరంగ వైభవంగా చేస్తారు. లాక్డౌన్ వల్ల చాలా వివాహాలు వాయిదా పడ్డాయి. అయితే కేరళలో ఓ జంట ఫోన్లోనే పెళ్లి కానిచ్చేసింది. వివరాల్లోకి వెళితే..
కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాకు చెందిన శ్రీజిత్ నాదేశన్ అదే ప్రాంతానికి చెందిన అంజన తో పెళ్లి నిశ్చయమైంది. జనవరిలో వీరి పెళ్లి జరగాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల పెళ్లి ఏప్రిల్ 26కు వాయిదా పడింది. అంజన ఉత్తరప్రదేశ్ లక్నోలో ఓ ఐటి కంపెనీలో పనిచేస్తోండగా… లాక్డౌన్ ఎఫెక్ట్తో ఆమె అక్కడే ఉండిపోయింది. ఇక మరోసారి పెళ్లి వాయిదా వేయడం ఇష్టం లేక ఇక వీరు టెక్నాలజీని ఉపయోగించుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ నెల 26న ఈ జంట వీడియో కాల్ యాప్ను వినియోగించుకుని ఒక్కటయ్యారు. పెళ్లి వస్త్రాలు ధరించి ఇద్దరు వీడియో కాల్లో సెల్ఫోన్ల ముందు కూర్చుకున్నారు. సరిగ్గా మూహూర్తం సమయానికి వరుడు.. ఎదురుగా ఉన్న వధువును ఆన్లైన్లో చూస్తూ.. ఫోన్కు తాళి కట్టాడు. అటు వధువు తల్లి కూతురికి మూడు ముళ్లు వేసేసింది. కాగా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెల్ ఫొన్ కు తాళి కట్టడం చూసి నెటిజన్లు కామెంట్లతో అక్షింతలు వేస్తున్నారు.