
హైదరాబాద్, మే 17: ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఫస్టియర్లో 15 మార్కులకు, సెకండియర్లో 15 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్కు కేటాయించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. అయితే థియరీ పరీక్షల విధానంలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటి వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధులకు మాత్రమే 30 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలు ఉండేవి. ఈ సంస్కరణలు ఈ ఏడాదికి ఫస్టియర్కు మాత్రమే వర్తిస్తాయంది. 2027-28 నుంచి సెకండ్ ఇయర్కీ ఇవి అమలవుతాయి.
ఇప్పటివరకు ఎంపీసీ, బైపీసీలో ఇంటర్ సెకండియర్లోనే సబ్జెక్టుకు 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఉండేవి. ఇకపై ఫస్టియర్లో 15, సెకండియర్లో 15 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. అంటే ఎంపీసీ గ్రూపులో ఫిజిక్స్, కెమిస్ట్రీలకు 15 మార్కుల చొప్పున ఫస్టియర్లో 30 మార్కులకు ప్రాక్టికల్స్ పరీక్షలు ఉంటాయి. అలాగే మ్యాథమెటిక్స్లో ఇప్పటివరకు 75 మార్కులకు రాత పరీక్ష ఉండగా.. ఈ ఏడాది నుంచి 60 మార్కులకు మాత్రమే నిర్వహిస్తారు. ఇందులో15 మార్కులకు యాక్టివిటీ-బేస్డ్ లెర్నింగ్ (ఏబీఎల్) ఉంటాయి. మ్యాథమెటిక్స్లో రెండు పేపర్లు ఉన్నందున ఫస్ట్ ఇయర్లో ఏబీఎల్కు మొత్తం 30 మార్కులు కేటాయిస్తారు. ఇప్పటి వరకు మ్యాథమెటిక్స్లో అంతర్గత మూల్యాంకనం ఉండేది కాదు. ఇక ఇతర గ్రూపుల్లోని కామర్స్, ఎకౌంటెన్సీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాంగ్వేజెస్లకు 80 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. మిగిలిన 20 మార్కులకు ఇంటర్నల్ పరీక్షలు ఉంటాయి.
బోర్డు ప్రకటించిన మరో ప్రధాన సంస్కరణ ఏమిటంటే, MEC విద్యార్థుల కోసం గణితానికి ప్రత్యేక ప్రశ్నపత్రాన్ని అమలు చేయడం. ఇప్పటివరకు MPC, MEC విద్యార్థులందరికీ ఒకే ప్రశ్నపత్రాన్ని ఇచ్చేవారు. అంతేకాకుండా MPC గణితం మాదిరిగానే MEC విద్యార్థులకు కూడా గణితంలో 20 మార్కులకు యాక్టివిటీ-బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. థియరీ పరీక్షలు 75 మార్కులకు బదులుగా 80 మార్కులకు నిర్వహించబడతాయి. 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కొత్త సిలబస్తో కూడిన పాఠ్య పుస్తకాలను జూన్ 1 నాటికి పంపిణీ చేయనున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఈ టెక్ట్స్ బుక్స్లలో రేఖాచిత్రాలు, నాలెడ్జ్ బాక్సులు, క్యూఆర్ కోడ్లు, భారతీయ విజ్ఞాన వ్యవస్థలు, అవసరమైన చోట సిమ్యులేషన్లతో ముద్రించినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.