
హైదరాబాద్, జులై 12: రాష్ట్రవ్యాప్తంగా 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నియామక ప్రక్రియపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఔట్సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలిక కండక్టర్ల నియామకం పారదర్శకంగా జరుగుతోందని ఆర్టీసీ స్పష్టం చేసింది. మెదక్ జిల్లాలోని డిపోల పరిధిలో కొనసాగుతున్న తాత్కాలిక కండక్టర్ల ఎంపిక ప్రక్రియ నిబంధనల ప్రకారమే నిర్వహిస్తున్నట్లు మెదక్ రీజినల్ మేనేజర్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అధికారిక కాంట్రాక్ట్ ఏజెన్సీలను లాటరీ విధానంలో ఎంపిక చేసి, ఆయా ఏజెన్సీలు అందజేసిన అభ్యర్థుల జాబితాల ఆధారంగానే ఎంపిక జరుగుతోందని వెల్లడించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని, ముఖ్యంగా మంత్రి పేషీ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. అభ్యర్థుల పదో తరగతి మార్కుల మెమో, ఆధార్ కార్డు, నిర్దేశిత ఎత్తు ప్రమాణాలను పరిశీలించి ఎంపిక చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు రెగ్యులర్ కండక్టర్ పోస్టుల భర్తీ చేపట్టలేదు. మరోవైపు ప్రతి ఏడాది ఉద్యోగులు పదవీ విరమణ పొందుతుండటంతో ఖాళీలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతకాలంగా ఔట్సోర్సింగ్ విధానంలో తాత్కాలిక కండక్టర్లను నియమిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి ఆర్టీసీ యాజమాన్యం సమాయత్తమవుతోంది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
కండక్టర్ పోస్టుల భర్తీలో పదో తరగతి మార్కుల శాతాన్ని ప్రామాణికంగా తీసుకునే విధానం గతంలో అమలులో ఉండేది. అయితే మధ్యలో గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టడంతో కొందరు అభ్యర్థులు గ్రేడ్ పాయింట్లతో, మరికొందరు మార్కుల శాతంతో దరఖాస్తు చేసే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల మళ్లీ మార్కుల విధానం అమల్లోకి రావడంతో గ్రేడింగ్ను మార్కుల శాతంగా ఎలా పరిగణించాలనే అంశంపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయమై ఎస్సెస్సీ బోర్డుకు ఇప్పటికే లేఖ రాసినట్లు సమాచారం. బోర్డు నుంచి స్పష్టత వచ్చిన అనంతరం కండక్టర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి.