
హైదరాబాద్, మే 3: రాష్ట్రంలోని 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్2026 ప్రవేశ పరీక్షలు సోమవారం (మే 4) నుంచి ప్రారంభం కానున్నాయి. మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మొదటి సెషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే హాల్ టికెట్లను కూడా జారీ చేశారు. ఈఏపీసెట్కు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,01,194 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్కు 2,10,308 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్కు 90,569 మంది దరఖాస్తు చేసుకున్నారు. రేపట్నుంచి మొదలయ్యే ఈఏపీసెట్ ఆన్లైన్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెట్ కన్వీనర్ డాక్టర్ కె విజయ కుమార్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.