
హైదరాబాద్, మే 23: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ‘దోస్త్ 2025’ నోటిఫికేషన్ను ఇటీవల ఉన్నత విద్యామండలి జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి తొలి విడత రిజిస్ట్రేషన్లు మే 21వ తేదీతో ముగిశాయి కూడా. ఈ క్రమంలో డిగ్రీలో ఏ కోర్సులో చేరితే బెటర్ అంటూ విద్యార్థులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రాథమిక కీ కూడా విడుదలైంది. దీని ఆధారంగా ఎన్ని మార్కులు వస్తాయనే అంచనాకు విద్యార్థులు వచ్చారు. దీంతో విద్యార్ధులు దోస్త్కు ముందుగా దరఖాస్తు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈసారి డిగ్రీలో అనేక కొత్త కోర్సులు చేర్చబోతున్నట్లు, సిలబస్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాప్టర్లు తీసుకొస్తుండటంతో కొన్ని రకాల డిగ్రీ కోర్సులకు ఈసారి డిమాండ్ పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇంజనీరింగ్ కన్నా మెరుగైన కోర్సులు డిగ్రీ స్థాయిలో కూడా ఉన్నాయి. అయితే ఈ కోర్సులు ఎక్కువగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. తక్షణ ఉపాధి లభిస్తుందని, సాఫ్ట్వేర్ వైపు కూడా వెళ్లేందుకు మార్గం సుగమం అయ్యేందుకు అనుకూలమైన కొన్ని కోర్సుల గురించి విద్యార్థులు ఎక్కువగా ఆరా చేస్తున్నారు. బీకాంలో గతంలో సంప్రదాయ సబ్జెక్టులు ఉండేవి. ఇప్పుడు కొత్తగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), ఈ–కామర్స్ ఆపరేషన్స్, రిటైల్ ఆపరేషన్స్ వంటి కోర్సులు వచ్చాయి. ఈ–కామర్స్కు సంబంధించి ఆడిటింగ్ వ్యవస్థలోనూ డిజిటలైజేషన్కు డిమాండ్ పెరుగుతుండటంతో ఈ–కామర్స్, కంప్యూటర్ అనుసంధానిత కోర్సులు విద్యార్థులను అమితంగా ఆకర్షిస్తున్నాయి.
గతంలో బీఎస్సీలో మేథ్స్, బీజెడ్సీ వంటి కోర్సులకు ప్రాధాన్యం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బీఎస్సీలో టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఆపరేషన్స్, డిజిటల్ ఇండస్ట్రీయల్ ఆపరేషన్స్, బీఎస్సీ మేథ్స్ డేటాసైన్స్, బీఎస్సీ ఆనర్స్ వంటి కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. అలాగే బీఎస్సీలోనూ ఏదైనా ఒక ఇతర సబ్జెక్టు చదివేందుకూ అవకాశం ఉంటుంది. దీంతో బీఎస్సీ మేథ్స్ విద్యార్థులు డేటాసైన్స్కి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
దోస్త్ తొలి దశ సీట్ల కేటాయింపు మే 29న ఉంటుంది. ఆ వెనువెంటనే మే 30 నుంచి జూన్ 8వ తేదీ వరకు రెండో ఫేజ్ రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. మే 30 నుంచి జూన్ 9 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవల్సి ఉంటుంది. ఇక జూన్ 13న సెకండ్ ఫేస్ సీట్ల కేటాయింపు ఉంటుంది. మూడో ఫేజ్ దరఖాస్తుల స్వీకరణ జూన్ 13 నుంచి 19 వరకు ఉంటుంది. జూన్ 13 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్లు, జూన్ 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. దీంతో మూడు ఫేస్లలో డిగ్రీ ప్రవేశాలు పూర్తవుతాయి. జూన్ 30 నుంచి కొత్త విద్యా సంవత్సరానికి డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభం అవుతాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.