
అమరావతి, మార్చి 19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మార్చి 24వ తేదీతో ఈ పరీక్షలు ముగియనున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు పరీక్షలు ముగిసిన అనంతరం సెకండ్ ఇయర్ తరగతులు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మొదలవ్వనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసి రెండో ఏడాదిలోకి అడుగుపెట్టే విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి 23వ తేదీ వరకు సెకండ్ ఇయర్ తరగతులు నిర్వహిస్తారు. అనంతరం ఇంటర్ విద్యార్ధులతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్ధులకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు మొదలవనున్నాయి. అయితే ఇంటర్ విద్యార్ధులకు మాత్రం ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయి. ఈ మేరకు పబ్లిక్ పరీక్షల తర్వాత ఏప్రిల్లో తరగతులు నిర్వహించి, ఆ తర్వాత వేసవి సెలవులు ఇచ్చేలా విద్యా ప్రణాళిక రూపొందించారు.
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియట్లో ఎన్సీఈఆర్టీ సిలబస్ సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్ కేలండర్ను కూడా ఇంటర్మీడియట్ విద్యా మండలి తాజాగా విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరం మొత్తం 232 రోజులు పని చేయనున్నాయి. వేసవి సెలవుల అనంతరం జూన్ 1వ తేదీ నుంచి జూనియర్ కాలేజీలు పునఃప్రారంభం అవుతాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.