
హైదరాబాద్, ఫిబ్రవరి 15: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లలో నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (గ్రాడ్యుయేట్) పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్షల షెడ్యూల్ ఎట్టకేలకు విడుదల అయింది. ఈ మేరకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) అధికారిక ప్రకటనను విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్సీబీటీ 1 పరీక్షలు మార్చి 16 నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి. మొత్తం 12 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. సీబీటీ 1 పరీక్షల్లో అర్హత సాధించిన వారు మాత్రమే సీబీటీ 2 పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు.
కాగా మొత్తం 5,810 ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబర్లో ఆర్ఆర్బీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం పోస్టుల్లో సికింద్రాబాద్ రీజియన్లో 396 వరకు ఖాళీలు ఉన్నాయి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్ వంటి తదితర పోస్టులను భర్తీ చేయనుంది.
పరీక్షకు పది రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్లను బోర్డు విడుదల చేస్తుంది. ఆ తర్వాత పరీక్షకు సరిగ్గా 4 రోజుల ముందు నుంచి అధికారిక వెబ్సైట్లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచుతుంది. అంటే మార్చి 12వ తేదీ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నమాట. అభ్యర్ధులు తమ వివరాలతో ఆర్ఆర్బీ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2026 గ్రాడ్యుయేట్ సీబీటీ 1 పరీక్షల షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.