
హైదరాబాద్, ఫిబ్రవరి 16: జేఈఈ మెయిన్స్ 2026 తొలి విడత ఫలితాలు సోమవారం సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 12 మంది వంద పర్సంటైల్ సాధించగా.. ఇందులో ముగ్గురు తెలుగు విద్యార్థులు ఉండటం విశేషం. వీరిలో ఇద్దరు ఏపీకి చెందిన విద్యార్థులు ఉండగా, తెలంగాణకు చెందిన ఒక విద్యార్థి ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి శరత్ మహేశ్వరి, నరేంద్ర, మోహిత్ అనే ముగ్గురు తెలుగు విద్యార్థులు 100 పర్సెంటైల్ సాధించి సత్తా చాటారు. ఓపెన్ కేటగిరిలో పసల మోహిత్ 100 పర్సెంటైల్ సాధించగా, ఓబీసీ కేటగిరిలో నరేంద్ర బాబు టాపర్గా నిలిచాడు.
కాగా జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జేఈఈ మెయిన్ పేపర్ 1 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా దాదాపు 13.50 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో దాదాపు 95 శాతం మంది పరీక్షలు రాశారు. జనవరి 29న జరిగిన పేపర్ 2 పరీక్ష ఫలితాలు త్వరలోనే విడుదల చేస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.